రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడిపోయి, మంత్రి పదవులు తీసుకున్నోళ్ళున్నారు.. గెలిచి, ఏమీ చేయలేక ఇంటికెళ్ళి ఏడ్చినోళ్ళూ వున్నారు. సో, ఎవరు గెలిచారు.? ఎవరు ఓడారు.? అన్నదానిపై ఎవరికి ఇష్టమొచ్చిన చర్చ వారు చేసుకోవచ్చన్నమాట. అంతిమంగా అధికారంలో ఎవరుంటే, వాళ్ళు గెలిచినట్టని ఇప్పుడున్న రాజకీయ సూత్రాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ, గెలుపు అంటే అది కాదు. ఓడినా, జనం మనసుల్ని గెలవడం నిజమైన గెలుపు. ఈ విషయంలో జనసేనాని నిజంగానే గెలిచాడు.
పోటీ చేసిన రెండు చోట్లా (గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో) పవన్ కళ్యాణ్ ఓడిపోయినా, ఆయన్ని ‘పరాజితుడు’ అని ఎవరూ అనలేని పరిస్థితి. ‘పవన్ కళ్యాణ్ గెలిచి వుంటే బావుండేది’ అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోందంటే ఆయన గెలిచినట్టే కదా.! చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేశారు. ఓ చోట ఓడి, ఇంకో చోట గెలిచారు. ‘రెండు చోట్లా గెలిచి వుంటే బావుండేది’ అని అప్పట్లో అన్నవాళ్ళు చాలా తక్కువమందే.
చిరంజీవితో పోల్చితే, పవన్కళ్యాణ్ తన పార్టీతో సాధించిన ఓట్ల శాతం కూడా తక్కువ. అయినాగానీ, పవన్కళ్యాణ్ గెలిచాడు, జనం మనసుల్లో ఇప్పుడు కొలువు దీరాడు. చిరంజీవిని ఓడించేందుకు అప్పట్లో జరిగిన కుట్రలతో పోల్చితే, పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ఇప్పుడు జరిగిన కుట్రలు చాలా చాలా ఎక్కువ. డబ్బు, మద్యం ఏరులై పారాయి, జనసేనానిని ఓడించేందుకోసం. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్న మాట ఇది.
జనసేనకు సంబంధించి కొన్ని వైఫల్యాలు వున్న మాట వాస్తవం. కానీ, అవి పవన్ని ఓడించేంతటి పెద్దవి కావు. తెలుగుదేశం పార్టీకి చెంచాగిరీ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం, జనసేన మీద తీవ్ర ప్రభావం చూపింది. ‘మావాడే..’ అని టీడీపీ నేతలు చెప్పుకోవడం అటు టీడీపీని ముంచేయడమే కాక, జనసేనని కూడా దెబ్బతీసింది. ఇలాంటి ఈక్వేషన్స్ ఎన్ని వున్నా, జనసేనాని గెలిచేవాడే. కానీ, ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా ‘డబ్బు, మద్యం’ ప్రభావం చూపాయి. ఆయా నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలే కాదు, సాధారణ ప్రజానీకం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘ఓటర్లు అమ్ముడుపోయారు’ అనడం సబబు కాదని గెలిచినోడు చెప్పడం మామూలే. కానీ, జనసేన అభ్యర్థుల్లా ‘మేం డబ్బు ఖర్చుపెట్టలేదు.. గెలవడానికి అడ్డదారులు తొక్కలేదు..’ అని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలిగే ధైర్యమెవరికి వుంది.? ”ఓడిపోయినందుకు బాధపడ్డంలేదు. గెలిచేదాకా, పోరాటం చేయడమే జనసేన నినాదం. ఓటమి గెలుపుకి తొలి మెట్టు. మేం ప్రజల కోసం, ప్రజల తరఫున రాజకీయాలు చేస్తున్నాం. అంతిమంగా మేం గెలిపించాలనుకుంటున్నది ప్రజల్ని. అదే జనసేన గెలుపు. ఆ మార్పు కోసం మా ప్రయాణం, పోరాటం కొనసాగుతూనే వుంటాయి” అని జనసేనాని పవన్కళ్యాణ్, పార్టీ ముఖ్య నేతలతో జిల్లాల వారీ సమీక్షల సందర్భంగా వ్యాఖ్యానిస్తుండడం, ఆయన గుండె ధైర్యానికి నిదర్శనం.
ప్రస్తుతం జనసేన పార్టీకి వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే. కానీ, లక్షలాది మంది ప్రజలున్నారు జనసేన తరఫున. జనసేనకు ఓటు వేసినవారే వాళ్ళంతా. సమస్య ఎక్కడుంటే పరిష్కారం చూపేందుకు, ఆ సమస్యనెదుర్కొంటున్న ప్రజల తరఫున పోరాడేందుకు జనసేన వుంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన దరిమిలా, రాష్ట్రంలో ఇకపై ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన జెండా రెపరెపలాడబోతోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా బలమైన మార్పు కోసం తన ప్రయాణాన్ని మరింత ఉధృతం చేయబోతోంది.
Related Posts
జనసేనానికి ‘మెగా’ గైడెన్స్ షురూ
998907 344482Wow, incredible blog structure! How lengthy have you ever been blogging for? you produced running a blog look simple. The full appear of your website is amazing, well the content! 278448