ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.!
ఇంతకీ, ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్న జనాల పరిస్థితేంటి.? అసలు రాజకీయ పార్టీల కోసం జనం స్వచ్ఛంందంగా తరలి వచ్చే పరిస్థితి వుందా.? ప్చ్.. లేనే లేదు.! జన సమీకరణ రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఎంత ఖర్చుపెడితే అంత జనం వస్తున్నారు.! సో, ఖర్చు పెరిగిపోతోంది.
పెరిగిపోవడమంటే మామూలుగా కాదు.! వస్తున్న జనాన్ని ఐదొందలు, వెయ్యి.. చొప్పున లెక్కేసుకోవాలి.! ఔను, ఏదన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన బహిరంగ సభలో జనం కనిపించాలంటే, ఒక్కొక్కర్నీ ఐదొందలు, వెయ్యి, పదిహేను వందలు ఇచ్చి రప్పించుకోవాల్సిందే.
క్వార్టర్ బాటిల్ మద్యం, సొంత వాహనాల్లో వచ్చేవారికి పెట్రోల్ కూపన్లు, బిర్యానీ.. ఇవన్నీ అదనం.! అభ్యర్థుల వెంట ఎన్నికల ప్రచారంలో తిరిగేవారికీ గట్టిగానే చెల్లింపులు చేసుకోవాలి. గంటకు ఇంత మొత్తంలో చెల్లిస్తామంటూ, ఆ విధంగా జనాల్ని మాట్లాడుకుంటున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు ఖర్చు విషయంలో క్రియేట్ చేయబడుతుంటాయనుకోండి.. అది వేరే సంగతి.
అధికార వైసీపీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా ఖర్చు చేయాల్సి వస్తోందన్నది నిర్వివాదాంశం. జనసేనకు సంబంధించి, పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కారణంగా, ఖర్చు సమస్య వుండదు.. జనాల్ని డబ్బులిచ్చి తరలించాల్సిన అవసరమూ వుండదు.
నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో కూడా ఖర్చు అనేది పెద్ద సమస్య కాదు. బాలయ్య అభిమానులూ స్వచ్ఛంగానే తరలి వస్తున్నారు. ఇదేదో తూతూ మంత్రంగా చెబుతున్న విషయం కాదు, గ్రౌండ్ రిపోర్ట్.
ఎన్నికల సమయం, ఆపై వేసవి కాలం.. కూలీలకు పెద్దగా పనులు వుండటంలేదు. కూలి పనులకు వెళితే వచ్చే మొత్తం కంటే, ఎన్నికలకు సంబంధించిన సభలు, రోడ్ షోలు.. వంటి వాటిల్లో పాల్గొంటే ఎక్కువ సొమ్ములు గిట్టుబాటవుతున్నాయి కూలీలకి. ఆ కూలీలే, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటుండడం గమనార్హం.
ఉదయం ఒక టీమ్, సాయంత్రం ఇంకో టీమ్.. మధ్యాహ్నం సమయంలో అయితే, ఇంకో టీమ్.. ఇలా రాజకీయ పార్టీలకు చమురు బాగానే వదిలిపోతోంది జనాన్ని రప్పించడానికి. గెలిచాక, అంతకు మించి లాగేయగలమా.? లేదా.? అన్న టెన్షన్ అయితే, ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
కనిష్టంగా రోజుకి రెండు వేలు, గరిష్టంగా రోజుకి ఐదు వేల రూపాయల వరకు ఈ ఎన్నికల కూలీలకు దక్కుతోందంటే, రాజకీయం ఎంత ఖరీదైపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చెల్లింపులు క్యాష్ రూపంలోనే ఎక్కువగా జరుగుతోంది. అంత సొమ్ము, ఎలా తనీఖీల్ని దాటుకుని, రాజకీయ పార్టీల ద్వారా జనాలకు వెళుతోంది.? అన్నదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.
ఇలా, పెయిడ్ కూలీలే పార్టీల కార్యకర్తలుగా కనిపిస్తున్నారు గనుక, ఏ పార్టీకి ఎలా ఓట్లు పడతాయ్.. అన్నదానిపై ఎవరూ ఓ అంచనాకి రాలేకపోతున్నారు. కాగా, పేద కుటుంబాలు మాత్రం, ఎన్నికల సమయంలో తమ కడుపు హాయిగా నిండుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ పిలిస్తే, ఆ పార్టీ వెంట వెళతామని చెబుతున్నారు. అన్నట్టు, మద్యవర్తుల కక్కుర్తి అటు అభ్యర్థులకీ, ఇటు కూలీలకీ శాపంగా మారుతోంది.!