ఆంధ్రప్రదేశ్ లో కొత్త కేబినెట్ కొలువు తీరింది. శనివారం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి శాఖలు కూడా కేటాయించారు. జగన్ కేబినెట్ కూర్పుపై సర్వత్రా సానుకూల వాతావరణమే కనపడుతోంది. చక్కని సమతూకం పాటించారని, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం కల్పించారని ప్రశంసలు కురుస్తున్నాయి. సొంత సామాజికవర్గాని కంటే బీసీలు, ఎస్సీలకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని పలువురు హర్షిస్తున్నారు. అయితే, ఈ విషయంలో రెడ్డి సామాజికవర్గంలో మాత్రం అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమ సొంత పార్టీగా భావించే వైఎస్సార్ సీపీలోనే కులం కారణంగా పదవులు రాకపోవడంతో వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
తమ పార్టీ అధికారంలోకి రావడంతో తమకు మంత్రి పదవి ఖాయమని భావించినవారు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నారు. ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి మంత్రి పదవి దక్కకపోవడం శనివారం హాట్ టాపిక్ గా మారింది. తొలి నుంచి జగన్ వెన్నంటి ఉన్న నేతల్లో రోజా కూడా ఒకరు. తన వాగ్ధాటితో టీడీపీని ఇరుకుపెట్టిన ఆమె.. ఓ దశలో అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీ ఆమెకు కూడా వల విసిరినప్పటికీ, అందులో పడకుండా జగన్ తోనే ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎన్నికైన రోజాకు ఈసారి మంత్రిపదవి ఖాయమని, కీలకమైన హోంశాఖను ఆమెకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా మంత్రుల జాబితాలో రోజా పేరు కనపడలేదు. కేవలం కుల సమీకరణాల వల్లే రోజాకు చోటు దక్కలేదని తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బెర్తు ఖరారు కావడంతో రోజాకు అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు, నిరుత్సాహానికి గురైన రోజా.. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం హాజరు కాలేదు. ఆమె కోసం వైఎస్సార్ సీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ, ఆమె ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది.
ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిస్థితి కూడా ఇంతే. వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన ఆయన.. ఈసారి తనకు పదవి ఖాయమని భావించారు. కానీ ఆయన కల నెరవేరలేదు. డోన్ నుంచి రెండోసారి గెలిచిన గుమ్మనూరు జయరాంకు బీసీ కోటాలో పదవి వరించింది. దీంతో తాను ఎస్సీగానో, బీసీగానో ఎందుకు పుట్టలేదంటూ కాటసాని ఆవేదన వ్యక్తంచేశారు. వీరిద్దరే కాదు.. కుల సమీకరణాల ఆధారంగా పదవులు రాని రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇలా పెద్ద జాబితానే ఉంది.
అయితే, ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణం చేసినవారంతా రెండున్నరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని జగన్ ముందుగానే చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత 20 మందిని మార్చి, కొత్తగా మరో 20 మందికి అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా నిరాశకు గురైనవారికి అప్పుడు అవకాశం ఇస్తారన్న మాట. మరోవైపు రోజాకు జగన్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. తాను ఉన్నానని, తాను చూసుకుంటానని జగన్ ఆమెకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రోజా ఎప్పటిలాగే పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అంతకు మించిన ఆప్షన్ కూడా లేదని పేర్కొంటున్నారు.
Related Posts
ఐదుగురు డిప్యూటీలు: ప్లస్సా.. మైనస్సా?
వైఎస్ జగన్ క్యాబినెట్: తండ్రి బాటలోనే తనయుడు..
773817 771915Wow! This could be one specific of the most beneficial blogs Weve ever arrive across on this topic. Basically Superb. Im also an expert in this topic therefore I can comprehend your effort. 864219
119178 640019Very interesting info !Perfect just what I was seeking for! 707209