Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. నిత్యం సెక్యూరిటీ ఉండే జగన్ ఇంటి వద్ద ఈ వాహనం ఎటువంటి తనిఖీలు లేకుండా వెళ్లిందనే ఆరోపణలు వస్తున్నాయి.
‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయిన్ సంగతేంటి..? ఎందుకు తనిఖీ చేయలేదు..? అందులో ఏముంది..? అదేమన్నా బ్రెజిల్ సరుకా..? లేదంటే మద్యంలో మెక్కిన రూ.వేల కోట్లా..? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా..? అదీ కాదంటే.. ఇన్నాళ్లూ ఏపీ సెక్రటేరియట్లో దాచిన దొంగ ఫైళ్లా..? వీటికి సమాధానం చెప్తారా.. డీజీపీ గారూ..?’ అంటూ ప్రశ్నలు సంధించారు.
ఎన్నికల్లో గెలవడం సాధ్యంకాదని తేలడంతో వైసీపీ నేతలు తాయిలాలకు సిద్ధపడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. జగన్ ను శాస్వతంగా ప్యాలెస్ కే పరిమితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజాభీష్టాన్ని చీప్ ట్రిక్స్ తో మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.