కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం మిడతల దండు. సౌత్ ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయని భావిస్తున్న మిడతలు దేశంలోని రైతులను కలవర పెడుతున్నాయి. పంట పొలాలపై పడి పంటను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్రల్లో తమ ప్రతాపం చూపిస్తున్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే.. ఏ రాష్ట్రంలో ప్రజలకు అందాల్సిన ఆహారాన్ని మిడతలు తినేస్తున్నాయో అదే రాష్ట్రంలో అవే మిడతల్ని ఆహారంగా తినేస్తున్నారు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి నెలకొన్న రాష్ట్రం రాజస్థాన్.
ఎందుకంటే రాజస్థానీలు మిడతలను పట్టుకుని బిర్యానీ చేసుకుని లాగించేస్తున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. వచ్చిన మిడతలను పట్టుకుని బిర్యానీ మాత్రమే కాకుండా వివిధ రకాల వంటకాలు చేస్తున్నారు. మిడతల బిర్యానీ స్పెషల్ అంటూ రెస్టారెంట్లు కూడా వెలుస్తున్నాయి. మిడతలతో ఫ్రై కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎలా వండాలో కూడా చెప్తున్నారు స్థానికులు. మిడతలను ఉడికించ కాళ్లు, రెక్కలు తొలగించాలని రెసిపీ కూడా చెప్తున్నారు. ప్లేటు మిడతల బిర్యానీ రూ.200 కు విక్రయిస్తున్నారు.
నిజానికి మిడతలను పాకిస్థాన్ లోని చఛ్రో ప్రాంతంలో ఎక్కువగా తింటారు. ఫ్రై చేసుకుని స్నాక్స్ లా లాగించేస్తారు. పాకిస్థఆన్ కు రాజస్థాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ కూడా మిడతల ఫుడ్ ఫేవరేట్ గా మారింది. ఓ పక్క అదే రాష్ట్రంలో రైతులు మిడతలను తరిమేసేందుకు చేయని ప్రయత్నం లేదు. రసాయనాలు చల్లడం, డీజే సౌండ్లు పెడుతూ తిప్పలు పడుతున్నారు. రైతులే కాకుండా ఏకంగా విమానయాన శాఖ కూడా మిడతలతో జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అదీ పరిస్థితి.