Dwaraka: దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ద్వారక (Dwaraka) ఒకటి. అరేబియా సముద్రంలో మునిగి ఉన్న పవిత్ర ద్వారక క్షేత్రాన్ని భక్తులు వీక్షించేందుకు గుజరాత్ (Gujarat) ప్రభుత్వం ఓ అద్భుతానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జలాంతర్గామి సేవల్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజాగాన్ తో ఇటివలే ఒప్పందం కుదుర్చుకుంది.
జలాంతర్గామి 24మంది యాత్రికులు.. టెక్నీషియన్, గైడ్, ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లను తీసుకెళ్తుందని పర్యాటక అధికారులు వెల్లడించారు. సముద్రంలో 300 అడుగుల వరకూ వెళ్లగలిగే జలాంతర్గామి కావడంతో భక్తులు ద్వారక శిథిలాలు, అరుదైన సముద్ర జీవాలు చూసి మధురమైన అనుభూతి పొందుతారని అన్నారు. భక్తులకు ఇదొక అద్భతమైన అవకాశమని అన్నారు.
దీంతో గుజరాత్ పర్యాటకం మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక క్షేత్రం సముద్రంలో మునిగిపోవడంతో భక్తులెవరూ వెళ్లలేకపోయేవారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా జలాంతర్గామి ప్రారంభించాలని పర్యాటకులు, భక్తులు కోరుతున్నారు.