తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే మిగులుతారేమో. మరి, హరీష్ రావు సంగతేంటి.? అంటే, ఆయనకు బీజేపీ గాలం వేస్తోంది కదా.!
వాస్తవానికి, ఈ ప్రమాదకరమైన ఆటకు తెలంగాణలో తొలుత తెరలేపింది గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ జాతి పిత అనీ, ఇంకోటనీ.. దాదాపు పదేళ్ళపాటు కేసీయార్ గురించి గులాబీ పార్టీ ఎలివేషన్లు వేసుకుంది.
తెలంగాణలో ఇంకే పార్టీకీ చోటు లేదంటూ అహంకారమే ప్రదర్శించారు కేసీయార్. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా కూడా మార్చేశారు. అంతే, పార్టీ నుంచి తెలంగాణ పోయింది.. తెలంగాణ నుంచి పార్టీ పోయే దుస్థితీ దాపురించింది.
గతంలో గులాబీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ పక్షాన్ని చేర్చేసుకున్నారు కేసీయార్. నువ్వు నేర్పిన విద్యయే.. అంటూ, రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. రేపో మాపో మొత్తంగా గులాబీ పార్టీకి చెందిన శాసన సభా పక్షమంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చు.
ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ‘గేమ్’ని ఎంజాయ్ చేస్తోందనడం అతిశయోక్తి కాదు. గులాబీ పార్టీ గల్లంతయితే, తెలంగాణలో ఇన్స్టంట్గా లాభపడేది కాంగ్రెస్ తర్వాత బీజేపీనే. అందుకే, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఇరుక్కోవడం కేసీయార్కి చాలా పెద్ద సెట్ బ్యాక్. రాజకీయంగా, మానసికంగా ఆయన కుంగిపోతున్నారిప్పుడు. పార్టీలో ఎవరూ కేసీయార్ మాటల్ని లెక్క చేయడంలేదు. లోక్ సభ ఎన్నికల హంగామా నడుస్తున్నా, గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం లేదు.
ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గనుక సున్నా చుట్టేసినా, ఒకట్రెండు సీట్లతో సరిపెట్టినా.. తెలంగాణ గడ్డ మీద నుంచి గులాబీ పార్టీ గల్లంతవడానికి జస్ట్ కొన్ని రోజుల సమయం సరిపోతుందంతే.!