వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.?
వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే లేదు. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నిలువునా చీలిపోయింది. అలా చీలిపోవడానికి కారణం స్వయానా తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు వైఎస్ షర్మిల.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ కుటుంబంలో జగన్ ఒంటరి.. పులివెందుల రాజకీయాలకు సంబంధించి. వైఎస్ వివేకానంద రెడ్డి జీవించి లేరు. వైఎస్ విజయమ్మ ఏనాడో వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. పులివెందుల నుంచి చేస్తారా.? కడప నుంచి చేస్తారా.? అన్నదే కాస్త సస్పెన్స్. పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె లేదా సతీమణి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తే, వైఎస్ షర్మిల కడప లోక్ సభ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు.
వైఎస్ కుటుంబంలో ఈ చీలిక గురించి పులివెందులలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘చేజేతులా చేసుకున్నారు’ అంటూ జగన్ గురించి, పులివెందులలో జనం చర్చించుకుంటున్నారు. అయితే, పులివెందుల ఓటర్లను బతిమాలో.. భయపెట్టో.. తనవైపుకు జగన్ తిప్పుకోగలరన్నది అక్కడ ప్రముఖంగా వినిపిస్తున్నమాట.
వైఎస్ షర్మిల, ఏమాత్రం ఫోకస్ పెట్టినా.. త్రిముఖ పోటీ.. ఈ క్రమంలో అక్కడ జగన్ ఓటమి.. తప్పకపోవచ్చు.