భారత్ లో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రావడంలేదు. నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా.. ప్రతిరోజూ పాజిటివ్ కేసుల ఇంకా వెలుగు చూస్తేనే ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలో 15,712 కేసులు నిర్ధారణ కాగా, 507 మంది మృత్యువాతపడ్డారు. పరిస్థితి చూస్తుంటే ఈ వైరస్ ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలియడంలేదు. ఒకవేళ కేసుల సంఖ్య తగ్గి, మే 3వ తేదీతో లాక్ డౌన్ ఎత్తివేసినా.. విమానాలు, రైళ్లను నడిపే పరిస్థితి ఉండదని తెలుస్తోంది.
రైలు, విమాన ప్రయాణాల్లో వ్యక్తిగత దూరం పాటించే అవకాశం లేనందున.. వాటికి అనుమతిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా రైళ్లు, విమానాలపై ఆంక్షలు కొనసాగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి తొలి విడత లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు ప్రకటించగా.. భారతీయ రైల్వేతోపాటు విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుంచి ప్రయాణాలకు టికెట్లు విక్రయించాయి. కానీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగించడంతో ఆయా టికెట్ల సొమ్మును వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ మే 3 వరకు ఉండగా.. మళ్లీ మే 4వ తేదీ నుంచి టికెట్లు విక్రయించాలని ఆయా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కేంద్రం వెంటనే రంగంలోకి దిగి.. అప్పుడే ఎలాంటి టికెట్లూ విక్రయించొద్దని వాటికి ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు బుకింగులు ప్రారంభించొద్దని స్పష్టంచేసింది. దీంతో మే 3 తర్వాత సైతం రైళ్లు, విమాన ప్రయాణాలు ఉండే అవకాశాలు స్వల్పమేనని తెలుస్తోంది.
మే 3 తర్వాత పరిస్థితులను అంచనా వేసి.. పలు ఆంక్షల నడుమే రైళ్లు, విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా వ్యక్తిగతదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రైలు కోచ్ లో సీట్ల సామర్థ్యంలో సగం టికెట్లే విక్రయించాలని.. విమాన ప్రయాణాలకూ ఇదే వర్తింపజేయాలని పలువురు సూచనలు చేస్తున్నారు. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకు ఇలాంటి చర్యలు తప్పవని పేర్కొంటున్నారు.
448707 71395I gotta favorite this web site it seems invaluable very helpful 782393