ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటాడన్నది జగమెరిగిన సత్యం.
అదికార వైసీపీ మీద విపరీతమైన నెగెటివిటీ కనిపిస్తోంది గ్రౌండ్ లెవల్లో.! ఆ నెగెటివిటీ వల్లనే దాదాపు సగం మంది సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్ని వైసీపీ మార్చాల్సి వచ్చింది. ‘అభ్యర్థుల్ని చూసి కాదు, నన్ను చూసి ఓటెయ్యండి..’ అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రిగా గడచిన ఐదేళ్ళలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్ చెబుతుండగా, ‘ఎవరు అధికారంలో వున్నా సంక్షేమం అలాగే వుంటుంది.. అభివృద్ధి మాటేమిటి.?’ అని జనం ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి తాజాగా మేనిఫెస్టో ప్రకటించింది. ఆ మేనిఫెస్టో చూశాక, వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమం జుజుబీ అని జనం డిసైడ్ అయిపోయారు. వాస్తవానికి, ‘నవరత్నాలు ప్లస్’ పేరుతో కొత్త మేనిఫెస్టోని జగన్ విడుదల చేశాక, వైసీపీ శ్రేణులే దాన్ని పట్టించుకోవడంలేదాయె.
రాజధాని అమరావతిపై టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి స్పష్టతతో వుంది. పోలవరం ప్రాజెక్టు సహా, అనేక అంశాలపై కూటమి నుంచి స్పష్టత కనిపిస్తోంది. వీటి విషయమై వైసీపీ నుంచి ఎలాంటి స్పష్టతా లేకుండా పోయింది. వాలంటీర్లకు రెట్టింపు గౌరవ వేతనం, సామాజిక పెన్షన్ల మొత్తం పెంపు.. ఇవన్నీ కూటమి మేనిఫెస్టోలో ప్రధాన ఆకర్షనలు.
‘మనం కూడా ఇలా ప్రకటించి వుంటే బావుండేది..’ అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోందిప్పుడు. ‘చెయ్యగలిగేవే చేస్తాం.. ఉత్తుత్తి హామీలు ఇవ్వం..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుకాయిస్తున్నారుగానీ, 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన సీపీఎస్ రద్దు జరగలేదు, మద్య నిషేధమూ అమలు కాలేదు.
మద్య నిషేధం చేయకపోతే, ఓట్లే అడగబోమని అప్పట్లో జగన్ చెప్పుకొచ్చారు. ఇలా చాలా విషయాలపై జనానికి వైసీపీ మొహం చూపించుకోలేని పరిస్థితి. దానికి భిన్నంగా కూటమి మేనిఫెస్టో చాలా ఆకర్షణగా వుండడంతోపాటు, తమ జీవితాలకు భరోసానిచ్చేదిలా వుండడంతో, కూటమి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. సహజంగానే ఇది వైసీపీని కుదేలు చేస్తోంది.