Tata IPhones: ప్రపంచ మొబైల్ మార్కెట్లో పెత్తనం చెలాయించే ఐఫోన్ (IPhone) తయారీ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చేతికొచ్చింది. వచ్చే రెండున్నరేళ్లలో టాటా గ్రూప్ (Tata Group) నుంచి వచ్చే ఐఫోన్లు ప్రపంచం మొత్తం విక్రయించనున్నారు. దీంతో ఐఫోన్ తయారు చేసే తొలి భారత్ కంపెనీగా టాటా అవతరించింది. ఈమేరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అధికారికంగా ప్రకటించారు. తైవాన్ సంస్థ విస్ట్రన్ కు చెందిన కర్ణాటకలోని ప్లాంట్ టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు.
విస్ట్రన్ (Wistron) కార్ప్ చేతిలో ఉన్న ఐఫోన్ తయారీ రంగంలోకి టాటా గ్రూప్ (Tata Group) అడుగుపెట్టాలని భావించింది. దీంతో విస్ట్రాన్ కార్ప్ తో ఏడాదిగా చర్చలు జరుపుతోంది. అయితే.. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తారని భావించినా టాటా గ్రూప్ మొత్తం చేజిక్కించుకుంది. శుక్రవారం జరిగిన విస్ట్రాన్ గ్రూప్ డైరక్టర్ల సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. దీంతో కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్ 100 శాతం వాటాను 125 మిలియన్ డాలర్లకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలిపింది.