అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మొట్టమొదట ఈ మాట చెప్పింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు..’ అని తొలుత ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్. ఈ దిశగా పవన్ కళ్యాణ్, టీడీపీని ఒప్పించారు.. బీజేపీని సైతం ఒప్పించారు.
బీజేపీ – జనసేన మధ్య పొత్తు చాలాకాలంగా వుంది. జనసేన – టీడీపీ పొత్తు, ఎన్నికల ముందు కుదిరింది. అప్పటికి బీజేపీ – టీడీపీ ఒక్కతాటిపైకి రాలేదు. బీజేపీ – టీడీపీలను కలిపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నానా రకాల ప్రయత్నాలూ చేయాల్సి వచ్చింది.
టీడీపీ – బీజేపీ – జనసేన కలిస్తేనే, వైసీపీని ఓడించగలమని పదే పదే బీజేపీ అధినాయకత్వానికి చెబుతూ వచ్చారు జనసేనాని. ఎట్టకేలకు బీజేపీ కూడా కూటమిలోకి వచ్చింది. అయినాగానీ, బీజేపీలోని కొందరు వైసీపీ అనుకూలురు, కూటమిని విచ్ఛిన్నం చేయడానికి సోషల్ మీడియా వేదికగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.
కానీ, నిన్నటి అమిత్ షా బహిరంగ సభతో, లెక్కలన్నీ మారిపోయాయ్. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందంటూ, తిరుపతి – అయోధ్య సహా, చాలా అంశాలపై వైసీపీ సర్కారుని నిలదీశారు అమిత్ షా. వైసీపీ పాలన కంటే టీడీపీ పాలనే బెటర్.. అన్న మాట కూడా అమిత్ షా నోటి వెంట వచ్చింది.
పోలవరం ప్రాజెక్టుని రెండేళ్ళలో తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని అమిత్ షా ప్రకటించడమే కాదు, పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం వైసీపీయేనని విమర్శించారు. టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
అమిత్ షా పిలుపుతో, బీజేపీలోని వైసీపీ మద్దతుదారుల నోటికి దాదాపుగా తాళం పడ్డట్లే అయ్యింది. అదే సమయంలో, టీడీపీ మీదా జనసేన మీదా విమర్శలు చేసే వైసీపీ నేతల నోళ్ళూ ఇప్పుడు మూతపడిపోయాయ్. అమిత్ షా విమర్శల మీద ఎటాక్ చేసేందుకు వైసీసీ నేతలెవరూ ముందుకు రాని పరిస్థితి.
సరిగ్గా ఎన్నికల ముందర మారిన ఈ ఈక్వేషన్, వైసీపీని ఎన్ని తక్కువ సీట్లకు పరిమితం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.