ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్ జగన్ మల్లగుల్లాలు పడ్డారు.
ఫలితంగా తలెత్తిన గందరగోళం వైసీపీ నుంచి చాలామంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోవడానికి కారణమైంది. టిక్కెట్లు దక్కించుకున్న నేతల్లోనూ కొందరు, వైసీపీని కాదనుకున్న సంగతి తెలిసిందే.
వై నాట్ 175 కాస్తా, ఎలాగోలా 90 సీట్లు అయినా గెలవగలిగితే చాలనే పరిస్థితికి వైసీపీ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా, ఎన్నికల కోడ్ రాక మునుపు పరిస్థితి. సిద్ధం పేరుతో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలు, వాటి కోసం వాడిన వీఎఫ్ఎక్స్, చేసిన ఖర్చు.. ప్రజల తిరస్కారం.. వెరసి, పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది.
గులక రాయి ఎపిసోడ్ అయితే, ప్రజల్లో వైసీపీని మరింత చులకన చేసేసిందన్నది నిర్వివాదాంశం.! జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేస్తూ వచ్చిన చాలామంది అధికారులపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తూ వచ్చింది. అదిప్పుడు డీజీపీ వరకూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే డీజీపీ మీద వేటు పడిందో, ఆ తర్వాత జగన్ స్వరంలో మార్పు మరింత స్పష్టంగా కనిపించింది.
‘ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదు’ అంటూ జగన్ ప్రకటించేయడంతో వైసీపీ శ్రేణులు విస్తుపోయాయి. దాంతోపాటుగా, ‘సంక్షేమ పథకాల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆపేయిస్తున్నారు..’ అని జగన్ ఆరోపిస్తే, ‘అలాంటిదేం లేదు.. ఎన్నికల కోడ్ అమల్లో వున్నందున.. తాత్కాలిక నిలుపుదల మాత్రమే.. పోలింగ్ పూర్తయిన వెంటనే, ఆయా పథకాలు, లబ్దిదారులకు అందుతాయ్’ అని అధికారులు ప్రకటించేశారు.
ఇవన్నీ వైసీపీకి ఝలక్ మీద ఝలక్ ఇస్తున్న పరిణామాలే. ప్రతీదీ వైసీపీకి ప్రతికూలంగా మారుతుండడంతో, ‘ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు.. నన్ను అంతమొందించేందుకు కుట్ర..’ అంటూ బేల మాటలు మాట్లాడుతున్నారు వైఎస్ జగన్.
ఒక్కమాటలో చెప్పాలంటే, జగన్ మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది.