ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.?
ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్ రిపోర్ట్ అధికార వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. విశాఖ రాజధాని.. అన్న ప్రచారానికి ఉత్తరాంధ్రలో అసలెక్కడా మద్దతు లభించడంలేదు. ‘ఐదేళ్ళు అధికారంలో వుండి ఏం చేశారు.? విశాఖ రాజధాని.. అంటూ పబ్లిసిటీ స్టంట్లతో సరిపెట్టారు. విశాఖ పేరు చెప్పి, వైసీపీ నేతలే ఆర్థికంగా లాభపడ్డారు..’ అన్న చర్చ, ఉత్తరాంధ్రలో ఆ చివర నుంచి, ఈ చివర వరకూ వినిపిస్తోంది.
నదుల్ని తొలిచేశారు, భూముల్ని మింగేశారు.. వీటన్నిటికీ తోడు గంజాయిని విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చారు.. హత్యలు, దోపిడీల సంస్కృతి పెరిగిపోయింది.. పైగా, డ్రగ్స్ మచ్చ ఒకటి.! ఉత్తరాంధ్రలో ఎక్కడ విన్నా ఇదే చర్చ.
వైసీపీ పాలన విషయమై ప్రజల్లో ఇంత వ్యతిరకత కనిపిస్తోందంటే, ఫలితాలు ఎలా వుండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి.. అంటూ వైసీపీ చేసిన, చేస్తున్న పబ్లిసిటీని ఆ ప్రాంతంలోనూ పెద్దగా ఎవరూ విశ్వసించడంలేదు.
ఉత్తరాంధ్రలో ప్రధాన దేవాలయాల్లో ఒకటైన సింహాచలం దేవస్థానానికి సంబంధించి నడిచిన రాజకీయ రగడ కూడా, ఈ ప్రాంతంలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది.
విశాఖ నగరంలో అయితే, రుషికొండ వ్యవహారాన్ని నగర ప్రజానీకం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం పెత్తనాన్ని స్థానిక ప్రజానీకం ఛీత్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వామ్మో, గ్రౌండ్ రిపోర్ట్ మరీ ఇంత దారుణంగా వుందా.? అని వైసీపీ నేతలే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.