వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ‘కాపు’ నాయకులకు, సొంత సామాజిక వర్గం నుంచి సెగ తగులుతోంది. ఆయా నియోజక వర్గాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి.
‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అంటూ కాపు సామాజిక వర్గంలో, ‘అధికార పీఠంపైన’ ఆలోచన క్రమక్రమంగా బలపడుతోంది. కాపు సామాజిక వర్గం నుంచి గతంలో చిరంజీవి, రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తే, కొందరు కాపు నేతలే తొక్కేశారన్న వాదన వుంది. ఇప్పుడు ఇంకోసారి అలాంటి ప్రయత్నం జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతోందన్నది కాపు సామాజిక వర్గ పెద్దల ఆవేదన.
వంగవీటి రంగా విషయంలో కూడా కాపు నాయకులే, అర్థం పర్థం లేని రాజకీయాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం కొత్తేమీ కాదు. గతంలో పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన తేడా వుంది. మొన్నటికి మొన్న వారాహి విజయ యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ని తూలనాడారు కాపు నేత ముద్రగడ పద్మనాభం.. తన లేఖల ద్వారా. దాంతో, ముద్రగడకు సొంత సామాజిక వర్గం నుంచి సెగ తప్పలేదు.
తాజాగా, మంత్రి బొత్స సత్యనారాయణ అమెరికా పర్యటనకు వెళితే, అక్కడా ఆయనకు కాపు సామాజిక వర్గం నుంచి సెగ తగిలింది. జనసేనకు అనుకూలంగా నినాదాలు చేసిన కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎన్నారైలు, ‘కాపు ద్రోహి’ అంటూ బొత్సపై మండిపడ్డారు. దాంతో, అప్పటికి ఆ కార్యక్రమం నుంచి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయారు. ఈ ఘటనపై బొత్స డిఫెన్స్లో పడినట్లు తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గం నుంచి తగులుతున్న సెగ నేపథ్యంలోనే, మాజీ మంత్రి పేర్ని నాని, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలనుకుంటున్నారన్నది ఓ వాదన. గుడివాడ అమర్నాథ్ కావొచ్చు, అవంతి శ్రీనివాస్ కావొచ్చు, అంబటి రాంబాబు కావొచ్చు.. కన్నబాబు కావొచ్చు.. ఇలా చాలామంది వైసీపీ కాపు నేతలకు కాపు సామాజిక వర్గం నుంచే సెగ గట్టిగా తగులుతోంది.
రానున్న రోజుల్లో ఈ సెగ మరింత తీవ్రతరం కాబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోపక్క, అధినేత ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ మీద అర్థం పర్థం లేని విమర్శలు చేయక తప్పడంలేదని కొందరు వైసీపీ కాపు నేతలు, తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.