తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖేల్ ఖతం అయిపోయింది.! ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే బెటరని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కి తెగేసి చెప్పారు.
రాజమండ్రి కేంద్ర కారాగారంలో, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి అరెస్టయి, రిమాండ్ ఖైదీగా వున్న చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ అనంతరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై స్పష్టత వచ్చేసింది.
చంద్రబాబు నిర్ణయం పట్ల తెలంగాణ టీడీపీ నేతలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంకోసారి చంద్రబాబుతో భేటీ అయి, నచ్చజెబుతానని పార్టీ శ్రేణులకు కాసాని జ్ఞానేశ్వర్ హామీ ఇచ్చారట.
వాస్తవానికి, కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీలోకి ఆయన దూకెయ్యనున్నారట. అదెంత నిజమన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ – జనసేన మధ్య స్నేహం కుదిరింది. జనసేన – బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది గనుక, టీడీపీ శ్రేణులు జనసేన పార్టీకి మద్దతిస్తే, దాన్ని ‘పొత్తు ధర్మం’ అంటారేమో.! తెలంగాణలో జనసేనకు టీడీపీ సహకరిస్తే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ – జనసేన కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది. జనసేన పోటీ చేయని చోట్ల, బీజేపీకి టీడీపీ సహకరించే అవకాశం వుంది.
లేదూ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలకు తెలుగు తమ్ముళ్ళు సహకరిస్తారా.? అంటే, ఏమో ఆ అవకాశాన్నీ కొట్టి పారేయలేం.