‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదు..’ అని అదే వైసీపీ చెబుతోంది.
ఇంతకీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో వుందా.? లేదా.? భూముల రిసర్వే వ్యవహారంలో అసలు మతలబు ఏంటి.? ఇదీ, ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోనే వుందనీ, ఆ యాక్ట్ వల్ల జరిగిన రిజిస్ట్రేషన్ కారణంగా, తమ భూమిలో కొంత భాగం కోల్పోవాల్సి వచ్చిందనీ.. బాధితులు ఆ విషయాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తున్నారు.
కాగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరైనా నష్టపోతే, నష్టపరిహారం ఇస్తాం.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. నష్టపరిహారం ఏ రూపంలో ఇస్తారు.? ఎంత ఇస్తారు.? మార్కెట్ వాల్యూకీ, అధికారిక లెక్కలకీ అస్సలు పొంతన వుండవు.. భూముల ధరలకు సంబంధించి. ఇది జగమెరిగిన సత్యం. మరి, నష్టపరిహారం ఎలా.?
నష్టపరిహారం ఇస్తాం.. అని చెప్పడమంటే, అక్రమాల్ని నివారించడం అసాధ్యమని ప్రభుత్వం చెబుతున్నట్లే కదా.? ఇంత డొల్ల చట్టాన్ని జనం మీద ఎందుకు బలవంతంగా రుద్దడం.? పైగా, ఆ పత్రాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో వుంటుందన్న వాదన నేపథ్యంలో మరింత వివాదాస్పదమవుతోంది.
భూమి అంటే, అది కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం. తరతరాలుగా వచ్చే ఆస్తి అంటే, దాని పట్ల మక్కువ సహజంగానే వుంటుంది. ప్రాణాలొడ్డి తమ భూమిని ఆక్రమణల నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు సామాన్యులు.
‘విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయ్..’ అంటూనే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైసీపీ తరఫున భిన్న వాదనలు తెరపైకొస్తుండడం ఈ యాక్ట్లోని డొల్లతనాన్ని చెప్పకనే చెబుతున్నాయ్.
‘వైసీపీ అధికారంలోకి వస్తే, మా భూముులు పోతాయ్..’ అన్న భయం జనాల్లో బలపడిపోయింది. అన్నట్టు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలదీయాలంటూ ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
‘కూటమి అధికారంలోకి వస్తే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం..’ అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కదా. దానికి బీజేపీ కూడా ఆమోద ముద్ర వేసింది కదా.? అలాంటప్పుడు, నిలదీయాల్సిన అవసరం ఏముంది??