Vizianagaram: విజయనగరం (Vizianagaram) జిల్లా కంకటాపల్లిలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖపట్నం, విజయనగరం ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక పాసింజర్ రైలు సిగ్నల్ కోసం కంకటాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది.
ఈ సమయంలో వెనుకాలే విశాఖ-రాయగడ రైలు వేగంగా వచ్చి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఘటనలో 3బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమాచారం అందగానే ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అక్కడ అంధకారం అలముకుంది. సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.
సీఎం జగన్ దిగ్భ్రాంతి..
రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్లను పంపించాలని.. వైద్యం అందించేందుకు సమీప ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో ఘటనా స్థలానికి 14 అంబులెన్సులు చేరుకున్నాయి. బాధితుల వివరాల కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157, రైల్వే కార్యాలయంలో 8978080006 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. మరోవైపు అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాట్లు చేశారు.
0891 2746330,
0891 2744619
81060 53051
81060 53052
85000 41670
85000 41677
83003 83004
85005 85006