Wht Not 175: ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ గెలిచేస్తామంటోంది వైసీపీ.! ఇంకోపక్క తమ పార్టీకి వున్న ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఒకరొకరుగా జారుకుంటున్నారు. ఓ ఎంపీ వికెట్ డౌన్.. నలుగురు ఎమ్మెల్యేలు ఔట్. మరో, అరడజను మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలూ వైసీపీకి దూరమయ్యే పనిలో బిజీగా వున్నారు.
రోమ్ తగలబడిపోతోంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు.. వైసీపీ పరిస్థితి నానాటికీ దయనీయంగా తయారవుతోంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం, ‘గడప గడపకీ మన ప్రభుత్వం.. నువ్వే మా నమ్మకం జగనన్న.. జగనన్నకి చెబుదాం..’ అనే పబ్లిసిటీ స్టంట్స్తో టైమ్ పాస్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
అకాల వర్షాల వల్ల రైతులు నానా ఇబ్బందులూ పడుతోంటే, రైతుల్ని ఆదుకోవాల్సిన మంత్రులేమో, రైతుల్ని ఉద్దేశించి ‘ఎర్రి పప్ప’ అంటూ విరుచుకుపడుతున్నారు. అబ్బే, దానర్థం వేరే వుందంటూ కొత్త అర్థాలు చెప్పి ‘బుజ్జి నాన్నలు’గా మారుతున్నారు.
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమైతే, అప్పటిదాకా మొద్దు నిద్రలో వున్న అధికార యంత్రాంగం, రాత్రికి రాత్రి నానా హైరానా పడింది. ఉద్యోగులే కూలీలుగా మారి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
పవన్ కళ్యాణ్ అంటే భయమెందుకు.? అధికారులు అంత హైరానా పడాల్సిన అవసరం ఏమొచ్చింది.? అదేదో, నిన్న ఉదయాన్నే చేయొచ్చు కదా.? రాత్రికి రాత్రి కంగారు పడటమెందుకు.? వైసీపీ పాలన ఇంతే.! అయినాగానీ, వై నాట్ 175. నవ్విపోదురుగాక.. వాళ్ళకేటి.?
అధికార పార్టీ అలసత్వం కాస్తా, అధికారులకు శాపంగా మారుతోంది. జనసేనాని రంగంలోకి దిగితే మాత్రం ‘పనైపోద్ది’.!