భావి భారత పౌరులు వాళ్ళు.! కానీ, ఏం లాభం.? అర్థాంతరంగా జీవితాన్ని ముగించేస్తున్నారు.! పరీక్షల భయం.. మార్కుల భయం.! వెరసి, పరీక్షా ఫలితాలు వచ్చాక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భయంతో ఫలితాలు రాకుండానే ప్రాణాల్ని తీసేసుకుంటున్నారు.!
తెలంగాణలో ఓ విద్యార్థి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించాడు. దాదాపు 900 మార్కులు వచ్చాయ్. కానీ, ఏం లాభం.? ఆ మార్కులు చూసుకోవడానికి ఆ విద్యార్థి జీవించి లేడు. ‘పరీక్షలు బాగా రాయలేదు..’ అన్న భయంతో, బలవన్మరణానికి పాల్పడ్డాడు.
టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులిలా ఎందుకు ప్రాణాలు తీసేసుకుంటున్నట్టు.? పరీక్ష ఫెయిలయితే, జీవితం ముగిసిపోయినట్లేనా.? నీట్ వంటి పోటీ పరీక్షల విషయాల్లోనూ ఇవే భయాలు విద్యార్థుల జీవితాల్ని నాశనం చేస్తున్నాయి.
అయితే ఇంజనీర్, లేకపోతే డాక్టర్.! ఇంతేనా.? ఇంకేమీ లేదా జీవితం.? కొత్తగా సీఏ చదువుతున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. డాక్టర్లు, ఇంజనీర్లే కాదు.. సమాజంలో చాలామంది వుంటారు. చాలా రకాల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలుంటాయ్. ఆ విషయాల్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడంలో విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి.
విద్య అంటే, అదో అమ్మకానికి వుంచబడిన వస్తువులా తయారైంది. అదే అన్ని సమస్యలకీ కారణం. కార్పొరేట్ విద్యాసంస్థలే ఎక్కువగా ఈ విద్యార్థుల బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. వందేళ్ళ జీవితం.. బోల్డన్ని జీవిత పరీక్షలుంటాయని తల్లిదండ్రులూ తమ పిల్లలకు నచ్చజెప్పుకోవాల్సి వుంటుంది.