Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం తగ్గించిన విషయం విదితమే.
పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పెరగడంతో, విజయసాయిరెడ్డి హవా తగ్గింది. పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు విజయసాయిరెడ్డి. ఆయన బీజేపీ వైపు అడుగులేస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది.
నందమూరి తారకరత్న గుండె పోటుతో ఆసుపత్రి పాలయ్యాక.. ఆయన తుది శ్వాస విడిచే వరకూ, అంత్యక్రియల సమయంలోనూ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయా వ్యవహారాల్ని పర్యవేక్షించారు.
ఈ క్రమంలో చంద్రబాబు – విజయసాయిరెడ్డి దగ్గరయ్యారన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఏమయ్యిందోగానీ, విజయసాయిరెడ్డి ట్విట్టర్ పిట్ట.. మళ్ళీ రాజకీయ విమర్శలు షురూ చేసింది.
‘పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తేనే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి గుక్కపట్టి ఏడ్చారు.. అలాంటివారు పేదలను కోటీశ్వరులు చేస్తామంటున్న చిత్తశుద్ధి లేని హామీల ‘మాయాఫెస్టో’ని నమ్మేదెవరు.?’ అంటూ తాజాగా ట్వీటేశారు విజయసాయిరెడ్డి.
నిన్న మొన్నటిదాకా విజయసాయిరెడ్డి మీద ఒకింత ప్రత్యేక సానుభూతి చూపిస్తూ వచ్చిన టీడీపీ నెటిజనం, ఇప్పుడాయన మీద కౌంటర్ ఎటాక్ షురూ చేసింది. సో, ముందు ముందు విజయసాయిరెడ్డి వర్సెస్ టీడీపీ.. ట్వీట్ల యుద్ధం తారాస్థాయికి చేరబోతోందన్నమాట.