Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్కి చేరింది. ఏ పార్టీలో వున్నా, ఆ పార్టీకి పక్కలో బల్లెంలా వ్యవహరిస్తుంటారు కేశినేని నాని.
అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలో కేశినేని నాని పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక, టీడీపీలో కేశినేని నాని వున్నారో, లేదో ఆ పార్టీకీ తెలియదు.. ఆయనకీ తెలియదు. అప్పుడప్పుడూ చంద్రబాబే తమ నాయకుడని చెబుతుంటారు.. అదే సమయంలో, టీడీపీని నిండా ముంచేసేల మాట్లాడుతుంటారు. దటీజ్ కేశినేని నాని.
వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానేమో.. అంటూ తాజాగా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేశినేని నాని పార్టీలో వుంటారో లేదో తెలియని డైలమాలో, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘టిక్కెట్ ఎవరికిచ్చినా నాకు సంబంధం లేదు..’ అంటూ కేశినేని వ్యాఖ్యానించారు. ‘నేను ప్రజల కోసమే పని చేస్తా.. భవిష్యత్తులోనూ అదే పని చేస్తా..’ అని చెప్పుకొచ్చారు.
కాగా, టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో ముగ్గురంటే ముగ్గురు మాత్రమే లోక్ సభకు ఎంపికయ్యారు. అందులో కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని వున్నారు.
గల్లా జయదేవ్ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. కేశినేని నాని సంగతి సరే సరి.! వైసీపీ ఆయనకు గాలం వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.