తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆరోపణలు కాదు, ఆధారాలున్నాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అసలు సిసలు ప్రత్యర్థి ఎవరన్నా వుంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే.. అన్నట్లుగా చాలాకాలంగా కేసీఆర్తో తలపడుతున్నారు రేవంత్ రెడ్డి.
టీడీపీలో వున్నప్పుడూ, టీడీపీ నుంచి బయటకొచ్చాక కూడా.. రేవంత్ రెడ్డి, కేసీఆర్తో పోరాటం కొనసాగిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం వెనుక పెద్ద ‘కథే’ నడిచింది. అయితే, ఆ కేసు నుంచి పూర్తిగా రేవంత్ రెడ్డి బయటపడకపోయినా, కాస్త ఉపశమనం దొరికిందాయనకి. ఓసారి కేసీఆర్ది పై చేయి అవుతోంటే, ఇంకోసారి రేవంత్ది పై చేయి అవుతోంది రాజకీయాల్లో.
కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేది లేదంటూ రేవంత్ స్థాయిలో తెలంగాణ నుంచి ఇంకెవరూ నినదించడంలేదన్నది నిర్వివాదాంశం. ఆ కారణంగానే రేవంత్ రెడ్డికి ఇదిగో ఇలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటారు ఆయన్ని అభిమానించేవారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇప్పుడు భూ కబ్జా ఆరోపణల్లోనూ రేవంత్ మరోమారు అడ్డంగా బుక్కయిపోయినట్లే కన్పిస్తోంది.
అయినాగానీ, ప్రతిసారీ రేవంత్ రెడ్డి.. రాజకీయంగా ఇంకో మెట్టు పైకెదుగుతూనే వున్నారు. నిజమే మరి, ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన రేవంత్ రెడ్డి, ఎంపీగా గెలవడమేంటి.? ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి రేస్లో వున్న రేవంత్ రెడ్డిని, ఇదిగో ఇలా భూ కబ్జాల ఆరోపణలతో దెబ్బకొట్టాలని కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్న విమర్శలు లేకపోలేదు. ఏదిఏమైనా, ఈసారీ రేవంత్ రాజకీయ కుట్రలను ఛేదిస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే, ఈసారి అష్ట దిగ్బంధనం లాంటిదే ఎదురయ్యిందనీ, రేవంత్ తప్పించుకోవడం కష్టమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.