సెప్టెంబర్ పదిహేడవ తేదీకి వున్న ప్రాధాన్యత ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ నాయకులు బహు చక్కగా చెప్పారు. ఏమయ్యిందోగానీ, ఆ ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ నాయకులు.. ఎనిమిదేళ్ళుగా సైలెంటయిపోయారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సెప్టెంబర్ 17వ తేదీ కూడా కీలక భూమిక పోషించింది. తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు సెప్టెంబర్ 17వ తేదీ కారణంగా రావాల్సిందేనంటూ అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి నినదించిన విషయాన్ని ఎలా విస్మరించగలం.? సెప్టెంబర్ 17వ తేదీ ప్రతి ఏడాదిలాగానే, ఈ ఏడాది కూడా వచ్చింది. కాకపోతే, ఈసారి కాస్త కొత్తగా.
కేంద్రం, సెప్టెంబర్ 17వ తేదీని ‘విమోచన దినోత్సవం’గా నిర్వహించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద్రాబాద్ వచ్చారు.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది కేంద్రం. తెలంగాణకూ అలాంటి ఆహ్వానమే పంపినా.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అందరూ మొహం చాటేశారు.
ఇంకోపక్క, తెలంగాణ రాష్ట్ర సమితి ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం..’ అంటూ వేడుకలు నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీది ఇంకో తంతు. కొత్త తెలంగాణ తల్లిని తెలంగాణ పీసీసీ ఆవిష్కరించింది. కమ్యూనిస్టులేమో తమకు తోచిన రీతిలో సెప్టెంబర్ 17వ తేదీని నిర్వహించడం గమనార్హం.
జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావాల్సిన తేదీ సెప్టెంబర్ 17. ఎందుకంటే, అదే రోజు భారతదేశంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని భూభాగంతోపాటు, ప్రస్తుతం కర్నాటకలోనూ, మహారాష్ట్రలోనూ వున్న కొంత ప్రాంతానికి నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే, పైన చెప్పుకున్న ప్రాంతానికి (అప్పటి హైద్రాబాద్ స్టేట్.. నిజాం సంస్థానం..) 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం సిద్ధించింది.. అదీ, భారత సైన్యం జరిపిన సైనిక చర్య ద్వారా. దానికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు అప్పట్లో నిజాం పాలన నుంచి విముక్తి.. భారతదేశంలో హైద్రాబాద్ స్టేట్ విలీనం.. ఇలా చాలా ప్రత్యేకతలున్నాయ్ సెప్టెంబర్ 17వ తేదీకి. కానీ, ఈ అద్భుతమైన ఘట్టాన్ని చరిత్ర పుటల్లో సరిగ్గా లిఖించలేదు. ఇప్పుడెలా దాన్ని జరుపుకోవాలో తెలియని దుస్థితి తెలంగాణ సమాజానిది. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే.