Parag Desai: ‘వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అనేది ఓ సామెత. ఎంతటి స్థితిమంతులైనా, ఉన్నత స్థితిలో ఉన్నవారైనా విధికి తలవంచాల్సిందే. 2వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధిపతి వాఘ్ బక్రీ టీ (Wagh Bakri tea) గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పరాగా దేశాయ్ (Parag Desai) .. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించడమే ఇందుకు నిదర్శనం. వివరాలను కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
గతవారం పరాగ్ దేశాయ్ ఇంటికి సమీపంలో కిందపడి తలకు గాయమైంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా మెదడులో రక్తస్రావం జరిగి కన్నుమూశారు. ఇంటికి దగ్గరలో వీధి కుక్కలు దాడి చేయడంతో పరాగ్ తలకు గాయమైంది. కుటుంబసభ్యులు, భద్రతా సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా మెదడులో రక్తస్రావమై మృతి చెందారని మీడియాలో కథనాలు వచ్చాయి.
వాఘ్ బక్రీ టీ గ్రూప్ లోని ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు. కంపెనీని ఈ-కామర్స్ లోకి తీసుకెళ్లడంతో ఆయనది ప్రముఖ పాత్ర. సేల్స్, మార్కెటింగ్, ఎగుమతులను పరాగ్ చూసేవారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.