Railway Station: ఆ ఊళ్లో ఓ రైల్వే స్టేషన్. ఎవరూ రైలెక్కరు. కానీ.. రోజుకి 60 టికెట్లు కొంటారు. ఎందుకిలా..? అంటే తమ ఊళ్లో రైల్వే స్టేషన్ ను కాపాడుకునేందుకేనని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్. ఆదాయంలేదని పద్మావతి ఎక్స్ ప్రెస్ కు హాల్టింగ్ తీసేశారు అధికారులు. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి కూడా ఇదే రైల్వే స్టేషన్. అసలే.. హైదరాబాద్, ఢిల్లీ, శిరిడీ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైళ్లు ఆగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పద్మావతి ఎక్స్ ప్రెస్ ఆగకపోవడంతో గ్రామస్థులు అధికారులకు విన్నవించుకున్నారు.
దీంతో గుంటూరు-సికింద్రాబాద్ రైలుకు తాత్కాలిక హాల్టింగ్ ఇచ్చి.. మూడు నెలలు గణనీయమైన ఆదాయం వస్తేనే ఫుల్ హాల్ట్ కల్పిస్తామని కండిషన్ పెట్టారు. దీంతో గ్రామస్థులంతా ‘నెక్కొండ టౌన్ రైల్వే టికెట్స్ ఫోరం’ అని వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి.. 400మంది సభ్యులుగా చేరి.. విరాళాలుగా రూ.25వేలు సేకరించి.. రోజూ పలు ఊళ్లకు టికెట్లు కొంటున్నారు. గ్రామస్థులంగా ఒక్కటై ఊరి కోసం చేస్తున్న పని ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.