Ayodhya: అయోధ్య (Ayodhya) లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500ఏళ్లనాటి కల సాకారమవుతూ రామాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 12.29నిముషాలకు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగగా.. బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు. అంతకుముందు జరిగిన విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. శ్రీరాముడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు.
కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో విల్లు, చిరుదరహాసంతో బాలరాముడుని చూసి భారతావని మొత్తం పులకించిపోయింది. ఈ క్రతువుల్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ సింగ్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, స్వామీజీలు పాల్గొన్నారు. పూజాసామాగ్రితో ఆలయంలోకి ప్రవేశించారు మోదీ. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించారు. ఈ సమయంలో ఆలయం మీదుగా హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, రణబీర్ కపూర్, అలియా భట్, సచిన్ టెండూల్కర్ తదితరులు పాల్గొన్నారు.