సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా కంగనా ని హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. గత కొన్నాళ్లుగా బీజేపీ విధానాలకు మద్దతిస్తున్న ఈమె ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఆమెకి కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డును కూడా ప్రకటించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను కూడా బీజేపీ వెల్లడించింది. తెలుగుదేశం, జనసేనతో పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి ఆరు పార్లమెంటు నియోజకవర్గాలను కేటాయించిన విషయం తెలిసిందే. ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, సీఎం రమేష్( అనకాపల్లి), పురందేశ్వరి (రాజమహేంద్రవరం), భూపతి రాజు శ్రీనివాస వర్మ (నర్సాపురం), వరప్రసాద రావు (ఎస్సీ) తిరుపతి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేయనున్నారు.