కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సీఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ఇవాళ కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని, పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నందున అన్ని లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.
‘కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని, అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలి. మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు ప్రతీ రోజు ప్రగతి భవన్ లోనే సర్కిళ్ల వారీగీ ప్రత్యేక సమీక్ష జరిపి, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలి. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలి. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని’ సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు.