టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాలూకు సెగ చైనాకు గట్టిగానే తగిలింది. తాము ఎంతటి దుస్సాహసానికి తెగబడినా ఇండియా ఏమీ చేయలేదని, బాయ్ కాట్ చైనా కూడా సాధ్యం కాదని భావించిన డ్రాగన్ కు డిజిటల్ స్ట్రైక్ రూపంలో షాక్ ఇవ్వడంతో కక్కలేక మింగలేక కొట్టుమిట్టాడుతోంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న మర్నాడే చైనా రాయబారి స్పందించిన తీరు చూస్తుంటే.. ఈ విషయంలో ఆ దేశం ఎంతగా ఆందోళన చెందుతుందో తెలుస్తుంది.
మన భద్రత దృష్ట్యా యాప్స్ నిషేధిస్తే.. అది అంతర్జాతీయ, వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని కొత్త రాగం అందుకుంది. అంతేకాకుండా మన ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమేనని తెగ బాధపడిపోతోంది. మరి గల్వాన్ లోయలో అన్ని ఒప్పందాలను పాతిపెట్టి మన సైనికులను దొంగ దెబ్బ తీసినప్పుడు పాత ఒప్పందాలు చైనాకు గుర్తుకురాలేదా అన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం.
పైగా చైనాలో ఏం జరుగుతుందో బయటివాళ్లు ఎవరూ చూడకూడదు. ప్రపంచం మొత్తం వాడుతున్న ఫేస్ బుక్, ట్విటర్ లు చైనాలో ఉండవు. తమ దేశ పౌరుల విషయాలు ఎవరికీ తెలియకూడదు. కానీ తాను మాత్రం ఇతర దేశాల భూభాగాల్లోకి చొచ్చుకెళ్లిపోతుంది. ఆయా దేశాల పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తుంది. ఇదీ దాని ధోరణి. మీ యాప్స్ నిషేధిస్తే ఇంత బాధపడిపోతున్నారు? మరి దీని సంగతేంటి అని అడిగితే డ్రాగన్ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు.
ఏ విషయంలోనైనా తప్పంతా ఇతరులతే అని ఎదురుదాడి చేయడం తప్ప పొరుగు దేశాలతో సజావుగా, సక్రమంగా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం కాసింత కూడా లేదు. నిజానికి చైనా యాప్స్ విషయంలోనే కాదు.. వాణిజ్యపరంగా ఆ దేశానికి భారత్ చాలా పెద్ద మార్కెట్. అలాంటిది మనతో సంబంధాలు ఎంత స్నేహపూర్వకంగా ఉండాలి? కానీ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. కరోనా వైరస్ విషయంలో ప్రపంచం మొత్తం చైనాను దోషిగా చూస్తున్న తరుణంలో అంతకంటే పెద్ద సంఘటనతో అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చాలి. తనకు ఎప్పటికైనా పోటీగా ఉండే భారత్ ను ఆక్రమించుకుంటే ఇక తిరుగు ఉండదు అనే దుర్బుద్ధితో గల్వాన్ లోయలో దుస్సాహసానికి తెగబడింది.
గతంలో కూడా చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు అప్పటి పాలకులు సరైన విధంగా స్పందించలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని భావించి ఆ దిశగా పావులు కదిపింది. కానీ మన సైనికుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో బిత్తరపోయింది. అయినప్పటికీ వెనక్కి తగ్గితే ఈగో హర్ట్ అవుతుంది. అందుకే మరింతగా మోహరింపులు చేపట్టింది. దీంతో చైనా యాప్స్ నిషేధానికి భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆర్థికంగా ఆయా కంపెనీలపై గట్టిగానే పడుతుంది. దీంతో చైనాకు సెగ తగిలి ఒప్పందాలకు తూట్లు అంటూ కొత్త పల్లవి అందుకుంది.
వాస్తవానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పినట్టు యాప్స్ నిషేధం ఒక్కటే సరిపోదు. చీటికీమాటికీ మనకు ఇబ్బందిగా పరిణమించిన చైనాకు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఈ క్రయంలో యాప్స్ నిషేధం మొదటి అడుగు మాత్రమే. ఇప్పటికే పలు రాష్ట్రాలు చైనా ప్రాజెక్టులను రద్దు చేసుకోగా.. బీఎస్ఎన్ఎల్ లో చైనాకు చెందిన 5జీ ఎక్విప్ మెంట్ వినియోగించకూడదని కేంద్రం నిర్ణయించింది. బాయ్ కాట్ చైనా ఉద్యమం కూడా క్రమంగా ఊపందుకుంటోంది. చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టడమే కాదు.. అంతర్జాతీయంగానూ ఏకాకి చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే ఇది సాకారం కావాలని ఆశిద్దాం.
221456 347430The whole glance of your website is magnificent, let smartly as the content! 822639