Amazon: అయోధ్య (Ayodhya) రామమందిరం (Shree Ram Mandir) ప్రారంభోత్సవ వేళ ఆన్ లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఏకంగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో నకిలీ ప్రసాదాల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో అమెజాన్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.
రామమందిరం ప్రారంభోత్సవాన్ని చూపి రామ ప్రసాదం అంటూ నకిలీ ఉత్పత్తులు విక్రయిస్తోందని ఆరోపిస్తూ ఆమెజాన్ పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. నకిలీ ఉత్పత్తుల్లో శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాద్, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, రఘుపతి నెయ్యి, దేవి ఆవు పాలు, ఖోయా ఖోబీ లడ్డూ.. పేర్లతో విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదుపై వేగంగా స్పందించిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపిఏ) అమెజాన్ కు నోటీసులు పంపింది. వారంలోగా వివరణ ఇవ్వకుంటే వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం సంస్థపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్న విక్రేతలపై చర్యలు తీసుకుని.. ఉత్పత్తులను తొలగించినట్టు తెలుస్తోంది.