దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత అరెస్టవడం సంచలనమే మరి.!
అంతకన్నా ముందు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతల అరెస్టులు జరిగాయి ఇదే కేసులో. మంత్రుల అరెస్టులూ చూశాం. తాజాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసులో అరెస్టయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టవడం.. దేశవ్యాప్తంగా పెను రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది.
ఈ అరెస్టుల పర్వం ఇక్కడితో ఆగుతుందా.? ముందు ముందు ఈ కేసులో ఇంకెలాంటి అరెస్టులు జరగబోతున్నాయ్.? ఇదే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తెలుగునాట గతంలోనే పలు అరెస్టులు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖులూ అరెస్టయ్యారు.
ఇక, ఇప్పుడు అందరి కళ్ళూ వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మీదనే పడ్డాయ్. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని, లిక్కర్ క్వీన్.. అంటూ గతంలో రాజకీయ ప్రత్యర్థులు విమర్శించిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పటిదాకా ఈ కేసులో ఎక్కడా భారతి పేరు ప్రస్తావనకు రాలేదు. అదంతా, వైఎస్ జగన్ బీజేపీ అధినాయకత్వం కాళ్ళు పట్టుకోవడం వల్లే జరిగిందన్న విమర్శల సంగతి సరే సరి.! ఇప్పుడిది ఎన్నికల సీజన్. అయినా, కవిత అరెస్టు జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కూడా జరిగింది.
వాట్ నెక్స్ట్.? ఇంకేముంది వైఎస్ జగన్ అరెస్ట్.. వైఎస్ భారతి అరెస్ట్.. అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. నిజమేనా.? ఆ ఛాన్స్ వుందా.? రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.
తాజాగా, రాష్ట్రం నెత్తిన లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ కుంభకోణం అనే పిడుగు కూడా పడిందాయె.! రానున్న రోజుల్లో ఎలాంటి ప్రకపంనలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోనున్నాయో వేచి చూడాల్సిందే.