Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది. చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో అవి చంద్రబాబుకు సమీపంలో పడ్డాయి. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో గందరగోళం చెలరేగింది. రాళ్లు విసిరి పరారైన వ్యక్తుల కోసం వెంటనే గాలింపు చేపట్టారు. దీంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్లెమెర్ మైన్స్ కే భయపడని వాడిని రాళ్ల దాడులకు ఎలా భయపడతానని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ..
‘గతంలో కోడికత్తి డ్రామా.. బాబాయి హత్యను కూడా నాపై నెట్టాలని చూశారు. నిన్న సీఎంపై.. నేడు నాపై, తెనాలిలో పవన్ కల్యాణ్ పై రాళ్లు విసిరారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను ఖండించాం. జగన్ సభలో కరెంట్ పోతే.. ఎవడో రాయి విసిరితే నాకు అంటగట్టడం ఏం న్యాయం. పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు. కరెంట్ తీసేసి.. రాళ్లు వేసినవారిపై చర్యలు తీసుకోకుండా నాపై నిందలు వేయడం ఏంటి..? విచారణ జరిపించి రాళ్ల దాడి చేయించినవారిపై చర్యలు తీసుకోవాల’ని అన్నారు.