విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీక్ అయిన విషవాయువుల కారణంగా 12 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ ఘటనపై చెలరేగిన రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి హుటాహుటిన విశాఖకు వెళ్ళి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాదు, గ్యాస్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం విదితమే.
అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు విమర్శించాయి. కాగా, ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తాజాగా హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. నివేదికలో, పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం తేటతెల్లమయిన దరిమిలా, ఈ కేసులో అరెస్టులు షురూ అయ్యాయి. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కీ జియాంగ్ సహా 12 మందిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయినవారిలో డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ మోహనరావు తదితరులున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇదిలా వుంటే, ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఆ ఘటనలో చనిపోయినవారి మృతదేహాలతో పరిశ్రమ యెదుట అప్పట్లో నిరసనకు దిగాయి బాధిత కుటుంబాలు. ఈ క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారనీ, దోషుల్ని తప్పిస్తున్నారనీ విపక్షాలు విమర్శలు చేసిన విషయం విదితమే. ఏదిఏమైనా, ఎల్జీ పాలిమర్స్ ఘటన.. అత్యంత బాధాకరం. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఘటన అది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతోపాటు, విషవాయువుల లీక్ కారణంగా భవిష్యత్తులో అక్కడి ప్రజలకు ఎదురయ్యే దుష్పరిణామాల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంది.
మరోపక్క, 12 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మొత్తమ్మీద, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో సంస్థ ప్రతినిథుల్ని అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కొంతమేర నిరూపించుకుందన్నది నిర్వివాదాంశం.