మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముద్రగడ పద్మనాభం.
రాజకీయాలన్నాక విమర్శలు సహజం.! కానీ, ఇక్కడ ‘వైరం’ కనిపిస్తోంది.! వైరం అనాలా.? విద్వేషం అనాలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏనాడూ ముద్రగడ పద్మనాభంపై మాట తూలింది లేదు. పైగా, ‘పెద్దాయన’ అంటూ గౌరవమిచ్చారు కూడా.
కాపు సామాజిక వర్గానికే చెందిన ముద్రగడ పద్మనాభం, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మీద ‘ద్వేషం’ పెంచుకున్నారు. అక్కసుతో రగిలిపోతున్నారు. దేనికోసం ఇంతలా పగబట్టేశారు.?
చివరికి, పవన్ కళ్యాణ్ గెలిస్తే, ‘ముద్రగడ పద్మనాభం రెడ్డి’గా తన పేరుని మార్చుకుంటాననీ, పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరతానని ముద్రగడ పద్మనాభం సవాల్ విసరడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం, ఈ ప్రకటనతో షాక్కి గురయ్యింది.
కొన్నాళ్ళ క్రితం ఓ సందర్భంలో, తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అది ఆ సామాజిక వర్గంపై అభిమానం, గౌరవం.. అన్నిటికీ మించి, ఆ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు చలించిపోయి ఆ మాటలు జనసేనాని నోటి వెంట వచ్చాయి.
కానీ, ఇక్కడ ముద్రగడ పద్మనాభం ‘రెడ్డి’ సామాజిక వర్గంలోకి మారిపోతాననడం, మత మార్పిడిలా కుల మార్పిడి వ్యవహారం కింద చూడాలి.! ‘నేను లక్షలాది మందికి ఉప్మా పెట్టాను.. చిరంజీవిగానీ, పవన్ కళ్యాణ్గానీ.. వారితో సినిమాలు చేసే దర్శక నిర్మాతలకు టీ, కాఫీ అయినా ఇచ్చారా.?’ అని ముద్రగడ పద్మనాభం అమాయకంగా ప్రశ్నించేశారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాక్ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయల స్వార్జితాన్ని ‘సాయం కోసం ఎదురుచూసేవారికి’ అందిస్తున్నారు. కేవలం సినిమా స్టార్లుగా వున్న గుర్తింపు మాత్రమే కాదు, వ్యక్తిత్వంలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరూ చాలా చాలా ప్రత్యేకమని.. సినీ పరిశ్రమలో ఎవర్ని అడిగినా చెబుతారు.
ఇవన్నీ ముద్రగడ పద్మనాభంకి తెలియవా.? అంటే, తెలుసు.! గతంలో, ముద్రగడపై టీడీపీ హయాంలో పోలీసులు అణచివేత చర్యలకు దిగితే, మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. అది ముద్రగడ పద్మనాభం మర్చిపోతే ఎలా.? కాపు సామాజిక వర్గం నుంచి అప్పట్లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్.. రాజ్యాధికారం దిశగా అడుగులేస్తే, ఆ కాపు సామాజిక వర్గంలో ముద్రగడ లాంటి కొందరు అడ్డు తగులుతున్నారు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? సమీప భవిష్యత్తులో కాపు సామాజిక వర్గానికి అధికారమే దక్కకూడదన్నట్లుగా వుంది ముద్రగడ పద్మనాభం రాజకీయ వ్యూహం.! సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నట్లు కేవలం ఉప్మా కోసమే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారా.? కాపు సామాజిక వర్గంపై ద్వేషంతో, రెడ్డి సామాజిక వర్గంలోకి మారిపోతున్నారా.?
ఒక్కటి మాత్రం నిజం, తన విమర్శలతో జనసేనకు చేటు చేయాలని ముద్రగడ అనుకుంటున్నారుగానీ, ‘ముద్రగడ పద్మనాభం రెడ్డి’ చేసే ప్రతి విమర్శా, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గంలో మైలేజ్ మరింత పెంచుతుందన్నది నిర్వివాదాంశం.
పుట్టిన కులంపై ఇంత ద్వేషమా ముద్రగడ పద్మనాభం.? అని కాపు సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది.! ఈ ప్రశ్నకి ముద్రగడ పద్మనాభం రెడ్డిలా మారిపోతున్న ఒకప్పటి కాపు ఉద్యమ నేత ఏం బదులిస్తారు.?