కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. అయితే, కరోనా వైరస్ కంటే పెను ముప్పు ముంగిట ప్రపంచం బిక్కుబిక్కుమంటోందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందుతోన్న దేశాలే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ముందు ముందు అభివృద్ధికి దూరమైపోయిన చాలా దేశాల తరహాలో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నాయని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
ఏ దేశానికి ఆ దేశమే కనీ వినీ ఎరుగని స్థాయిలో ఆర్థిక ఉత్పాతాన్ని చవిచూడాల్సి వస్తుందన్నది ఆర్థిక రంగ నిపుణుల హెచ్చరిక. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ‘అన్నమో రామచంద్రా..’ అని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆకలి కేకలు విన్పించబోతున్నాయట. మరీ, అంతటి దయనీయమైన పరిస్థితులుంటాయా.? అదీ రెండు నెలల సంక్షభానికేనా.? అని కొందరు ప్రశ్నించొచ్చుగాక. ఇప్పుడు చూస్తోన్న కరోనా ప్రభావం చాలా తక్కువేననీ.. రానున్న రోజుల్లో అసలు ముప్పుని మానవాళి ఎదుర్కోవాల్సి వుంటుందన్నది ఆయా రంగాల నిపుణులు చెబుతున్న మాట.
‘కరోనా వైరస్ విషయంలో ఆలస్యంగా స్పందించడమే కాదు, అతిగా కూడా స్పందించాం.. అదే ఈ దుస్థితికి కారణం’ అన్నది ఆర్థిక రంగ నిపుణుల వాదన. మన దేశం విషయానికొస్తే, లాక్డౌన్ నిర్ణయాన్ని చాలా ముందుగా తీసుకుని వుండాల్సిందనీ.. కొద్ది రోజుల ఆలస్యం.. దేశానికి పెను నష్టాన్ని మిగిల్చిందనీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలోకి ఒక్క కరోనా పేషెంట్ కూడా రాకుండా చేయగలిగి వుంటే, అసలు లాక్డౌన్ అవసరమే వచ్చేది కాదన్నది వారి వాదన. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక కూడా లక్ష కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం చిన్న విషయం కాదనీ, లాక్డౌన్ వెసులుబాట్లు ఇవ్వడమంటే మరింతగా జనాన్ని కరోనా కోరల్లోకి నెట్టేయడమేనని మేధావి వర్గం ఆరోపిస్తోంది. ‘ఆలస్యంగా స్పందించాం.. తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం..’ అని నిర్మొహమాటంగా మేధావి వర్గమే కాదు, సామాన్యులూ అభిప్రాయపడ్తున్నారు.
ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఆయా దేశాలు తమ పౌరుల్ని ఇతర దేశాల నుంచి రప్పిస్తున్న దరిమిలా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరింత విస్తరించనుందన్నది నిర్వివాదాంశం. కరోనా వైరస్కి అత్యంత వేగంగా వ్యాక్సిన్ కనుగొనగలిగితే మాత్రం.. ఈ విపత్తు నుంచి తప్పించుకోవచ్చు. కానీ, అదెప్పుడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈలోగా ప్రపంచ మానవాళికి జరగాల్సిన నష్టం జరిగిపోతూనే వుంటుంది.
589621 670743Fantastic process! 130203