ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఈ విపత్కర సమయంలో అక్కరకు రావడంలేదా? కరోనాను నిరోధించాలంటే భౌతిక దూరం పాటించాల్సిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కోసం జనాలు క్యూలో నిల్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది? 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసినా.. రేషన్ వారి చేత ఎందుకు పంపిణీ చేయించలేకపోతున్నారు? ప్రస్తుతం ఇవీ పలువురిని వేధిస్తున్న ప్రశ్నలు.
నిజానికి జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ చాలా మంచి ఫలితాలనే ఇస్తోంది. పలు రాష్ట్రాలు దీనిపై మక్కువ కూడా చూపిస్తున్నాయి. ఒక్కో వాలంటీర్ కు 50 ఇళ్లు కేటాయించడం వల్ల వారికి సంబంధించిన అన్ని విషయాలతోపాటు క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వానికి సులభంగా తెలుస్తుంది. దానికి తగినట్టుగా సర్కారు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థపై కేరళ వంటి రాష్ట్రాలు కూడా ఆసక్తి ప్రదర్శించాయి.
ప్రజలు ఏ పని కోసం ఎక్కడకీ వెళ్లకుండా ఇంటి దగ్గరే సేవలు పొందాలనే సంకల్పంతోనే జగన్ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రేషన్ సైతం ఇంటికే పంపిస్తామని పేర్కొన్నారు. అయితే, పింఛన్ల పంపిణీ ఒక్కటే వాలంటీర్లతో సజావుగా అమలవుతోంది. ఈ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఇంకా ఇంటి వద్దకు రేషన్ అమలు కావడంలేదు. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చి ఉంటే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అది ఎంతగానో ఉపయోగపడేది. కానీ అలా జరగకపోవడంతో ప్రజలకు రేషన్ కష్టాలు తప్పడంలేదు.
అసలే లాక్ డౌన్ నేపథ్యంలో రోజువారీ పనులు చేసేవారికి ఎలాంటి ఆదాయం లేదు. దీంతో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకుల కోసం క్యూలో పడిగాపులు పడుతున్నారు. నిజానికి ఈ విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు పలు అంశాల్లో బాగా ఉపయోగపడ్డాయి. ఇంటింటి సర్వే చేయడంలోనూ, క్వారంటైన్ విధించినవారిపై నిఘా పెట్టడంలోనూ, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడంలోనూ వారు చక్కని సేవలు అందించారు.
అయితే, రేషన్ పంపిణీకి సంబంధించి చిన్నచిన్న సమస్యలు ఉండటంతో ఆ పని ఇంకా వారికి అప్పగించలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం రేషన్ పంపిణీని వాలంటీర్ల ద్వారా చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా సర్కారు దీనిపై దృష్టి సారించి రేషన్ పంపిణీని కూడా ఇంటికే వచ్చేలా చూస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.