పాపం అనాలా.? నేరం అనాలా.? వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి, వారికి గౌరవ వేతనం పేరుతో, ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అబ్బే, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తరహాలో.. ఇది కూడా ఓ సంక్షేమ పథకం లాంటిదే.. యాభై ఇళ్ళకు ఓ వాలంటీర్ చొప్పున నియమించింది, ప్రజలకు సంక్షేమ పథకాలు మెరుగ్గా అందించడానికీ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి నేరుగా ప్రజలకు తెలియడానికీ.. అని వైసీపీ చెబుతోంది.
ప్రభుత్వానికి ‘ఉద్యోగులు’ అనే ఓ పెద్ద వ్యవస్థ వుంది. ప్రభుత్వం కోసం పనిచేసే ఉద్యోగులకు చట్టబద్ధత వుంది. వారికి ప్రతి నెలా వేతనాలు చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇతరత్రా అలవెన్సులు వంటివి మామూలే. అలాంటప్పుడు, కొత్తగా ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికి.? ఇదే మొదటి నుంచీ జనం మెదళ్ళలోనూ మెదులుతున్న ప్రశ్న.
ఓ వృద్ధుడు లేదా వృద్ధురాలికి వాలంటీర్ ప్రతి నెలా అందించే పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలు అనుకుందాం. మరి, వాలంటీర్కి నెల నెలా వచ్చేదెంత.? ఐదు వేలు. వీటికితోడు ఆమ్యామ్యాలు గట్టిగానే వాలంటీర్లకు దక్కుతున్నాయనీ, చిన్న చిన్న సెటిల్మెంట్లూ చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.
సరే, వాలంటీర్లంతా అలాంటోళ్ళేనని అనలేం. కానీ, ఆ వాలంటీర్ అనే ముసుగేసుకుని, అసాంఘీక శక్తులు కొన్ని చెలరేగిపోతున్నమాట వాస్తవం. వాటిని అదుపు చేయడానికి సరైన యంత్రాంగమే లేకుండా పోయింది. ‘వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలే’ అని వైసీపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యనే ఆ మాట సెలవిచ్చారు.
వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేనని ముఖ్యమంత్రి, మంత్రుల చెప్పకుండా వుండి వుంటే, ఈ రోజున వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా వుండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనకుండా ఆదేశాలు జారీ అయి వుండేవి కాదు. నిజానికి, వాలంటీర్ల గొంతు నొక్కిందీ, ఆ వ్యవస్థ మీద మచ్చ వేసిందీ అధికార వైసీపీనే.
రేప్పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించొచ్చేమో… అది వేరే చర్చ. కానీ, వాలంటీర్ వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా వుండాల్సిందే. అదే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ద్వారా అర్థమవుతున్న విషయం.
వాలంటీర్లకు వైసీపీ ముసుగేయడం వైసీపీ నేతలు చేసిన అతి పెద్ద తప్పు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కూడా ఆ తప్పు చేశారు. తప్పు తమ దగ్గర పెట్టుకుని, విపక్షాల కుట్ర అనడం ఎంతవరకు సబబు.? గొడ్డలి వేటుని గుండె పోటుగా ఏమార్చే ప్రయత్నం చేసిన వైసీపీకి, ఇప్పుడీ వైసీపీ వాలంటీర్ల విషయంలో నేరాన్ని విపక్షాల మీదకు నెట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు.