మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
‘నిందితుడ్ని పక్కన పెట్టుకుని, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి అసత్యాలు చెబుతున్న జగన్..’ అంటూ మండిపడ్డారు సునీతా రెడ్డి. ‘చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గురించి ఐదేళ్ళ క్రితం మాట్లాడి, అధికారంలోకి వచ్చాక మర్చిపోయి, మళ్ళీ ఎన్నికలు రాగానే, చిన్నాన్నని గుర్తు చేసుకుంటున్న జగన్..’ అంటూ ఎద్దేవా చేశారామె.
అసలు సీబీఐ విచారణ వద్దంటూ పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి కారణమేంటి.? అని జగన్ని సునీతా రెడ్డి నిలదీయడం గమనార్హం. హత్య చేసిన వ్యక్తి చెప్పిన మాటకు విలువ ఇచ్చి, అతనే వివేకానంద రెడ్డిని చంపినట్లు జగన్ చెబుతున్నారనీ, మరి అదే హంతకుడు.. ఆ హత్యకు కుట్రదారు వైఎస్ అవినాష్ రెడ్డి అని చెబుతోంటే జగన్ ఎందుకు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని ప్రశ్నించారు సునీతా రెడ్డి.
‘అవినాష్ రెడ్డికి ఈ హత్యతో సంబంధం వుంది. మీకూ, మీ భార్య భారతికీ ఈ హత్యతో సంబంధం వుందనే నిజం ఏమైనా బయటపడుతుందనా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు.?’ అంటూ సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి దారుణ హత్యకు గురవడంపై మొదటి నుంచీ సునీతా రెడ్డి ఒంటరిగానే న్యాయ పోరాటం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో, సునీతా రెడ్డిని వెంటేసుకుని వైఎస్ జగన్ నానా హంగామా చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై.
అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైతే, ‘గుండె పోటుగా’ ఏమార్చే ప్రయత్నం చేసింది వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా. సునీతా రెడ్డి గట్టిగా నిలబడ్డంతోనే, వివేకానంద రెడ్డి గుండె పోటుతో చనిపోలేదు, దారుణ హత్యకు గురయ్యారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
మొత్తమ్మీద, 2019 ఎన్నికల తరహాలో, ఇప్పుడూ వివేకా హత్య కేసుతో సింపతీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారయ్యారు సునీతా రెడ్డి. సునీతా రెడ్డి తాజా ఆరోపణలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తారా.? వేచి చూడాల్సిందే.