పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ- కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ బరిలో దిగుతుండగా.. మరో వైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి తన అన్నపై పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో శింగనమల నియోజకవర్గం వైపు అందరి దృష్టి పడింది. అందుకు కారణాలేంటంటే..
మరో మూడు రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల్లో బరిలో నిలుచున్న పార్టీల నేతలంతా భారీ బహిరంగ సభలు, ప్రచారాలతో.. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నారు. కాగా ఎన్నడూ లేనంతగా ఈసారి ఏపీ ఎన్నికలు మరింత ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
గత కొంతకాలం వరకూ రాష్ట్రంలో వైసీపీ- టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గురించి తప్ప కాంగ్రెస్ నాయకుల పోటీపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించలేదు. కానీ ఎప్పుడైతే వైఎస్ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారో అప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన అన్న జగన్ను లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు గుప్పించడం.. ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోసం పాటుపడటం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పటి నుంచి ఓ లెక్క అన్నట్లుగా మారింది. ఇందుకు కారణం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి శైలజానాథ్ పోటీ చేయడం. దీంతో అక్కడ ప్రధాన పార్టీల మధ్య పోటీ మరింత తీవ్రంగా మారి ఉత్కంఠను కలిగిస్తోంది.
కాగా 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ రెండు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు- వైసీపీ మధ్య గట్టి పోటీ కొనసాగుతుండగా శింగనమలలో మాత్రం కథ వేరేలా ఉంది.ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడు ఎక్కువగా కనిపించడంతో గెలుపోటములపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
కాగా ఉమ్మడి రాష్ట్రంలో శింగనమల నియోజకవర్గంలో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా సాకే శైలజానాథ్ పనిచేశారు. అయితే 2014 లో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ సీటు దక్కించుకోలేకపోయింది. రెండు సార్లూ ఓటమి పాలయ్యింది. ఆ జాబితాలో మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఉన్నారు.
ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన శైలజానాథ్.. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా సొంత నియోజకవర్గం కోసం పనిచేశారు. కాగా తనను పార్టీలోకిి రమ్మని వైసీపీ, టీడీపీ నేతలు ఆహ్వానించినా ఆయన తిరస్కరించి కాంగ్రెస్ కోసమే పనిచేశారు. అయితే ఈ పదేళ్లుగా శింగనమల నియోజకవర్గంలో ఓసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారం చేజిక్కించుకున్నాయి.
దీంతో ఈ సారి కూడా ఈ నియోజకవర్గంలో జెెండా ఎగురవేసేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ పదేళ్లలో శింగనమల నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడంతో.. దీనిని శైలజానాథ్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్థానిక సమస్యలను గత ఎమ్మెల్యేలు పరిష్కరించకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. శైలజానాథ్ ప్రచారాలు చేస్తున్నారు. ఈసారి తనను గెలిపిస్తే నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు.
ఈ క్రమంలో గతంలోని ఓట్ బ్యాంక్ను తిరిగి తనవైపునకు తిప్పుకునేందుకు శైలజానాథ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఆయనకు కొన్ని సంఘటనలు కూడా కలిసి వస్తున్నాయి. స్థానికంగా వైసీపీ నేతల్లో, టీడీపీ నేతల్లో సమన్వయం కూడా కొరవడటం కూడా ఓ కారణం. దీనిని ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేయడంతో నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. దీంతో సర్వేల ఫలితాలు కూడా శింగనమల కాంగ్రెస్ వైపే అన్నట్లుగా ఉన్నాయి.
ఇక పోలింగ్ దగ్గరపడుతుండటంతో శైలజానాథ్.. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ప్రచారం చేస్తున్నారు. స్థానిక నాయకుల మద్దతు కూడా కోరుతూ.. ఇతర సీనియర్ నేతలతో కూడా కో ఆర్డినేషన్ కోసం యత్నిస్తున్నారు. దీంతో ఈ సారి శింగనమలలో గెలుపు కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్దే అని ప్రచారం గట్టిగా సాగుతోంది. ఫలితంగా నియోజకవర్గ ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది.