ఓ పత్రికాధినేత ‘జెండా పీకేద్దామా?’ అంటూ ప్రజారాజ్యం పార్టీపై విషం చిమ్మడం అప్పట్లో చాలా చర్చనీయాంశమయ్యింది. అయితే ఆనాటి రాజకీయ పరిస్థితులు, భ్రష్టుపట్టిన రాజకీయాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి నడపలేకపోయిన మాట వాస్తవం. రాజకీయాల్లో రంగులు ఎలా మారిపోతాయో, ఎవరి వెనుకాల ఎలాంటి కుట్రలు దాగి వుంటాయో రంగంలోకి దిగాకగానీ చిరంజీవి తెలుసుకోలేకపోయారు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ జెండాని ‘ఆ ఇద్దరు రాజకీయ ప్రముఖులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు’ పీకేయడానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయిగానీ, ఇప్పుడు జనసేన విషయంలో అలా కుదరదు.
ఐదేళ్ళపాటు రాజకీయ పరిస్థితుల్ని పవన్కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించారు, అర్థం చేసుకున్నారు. ‘అవసరమైతే ఇంకా ఇంకా నేర్చుకుంటాను’ అని పవన్ చెబుతున్న మాటల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. అత్యంత పకడ్బందీగా ఐదేళ్ళ తర్వాత జనసేన పార్టీని ఎన్నికల బరిలోకి దింపారు. ఓ తప్పుడు మాటని పదిసార్లు చెబితే అదే నిజమవుతుందనే భావనలో వున్న కొందరు రాజకీయ నాయకులు, జనసేన పార్టీ 65 స్థానాల్లోనే పోటీ చేస్తోందంటూ పిచ్చి లెక్కలు తెరపైకి తెచ్చినా జనసేన వెరవలేదు. మొన్న తెలంగాణ పత్రికలో, ఆ తర్వాత జగన్కి చెందిన పత్రికలో ఇవే కథనాలు వచ్చాయి. ఆ పాత చెత్త కథనాల్ని ప్రస్తావించారు తాజాగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ కూడా గట్టిగానే పడింది జనసేన ముఖ్య నేత లక్ష్మినారాయణ నుంచి.
చార్టెర్డ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డికి వయసు మళ్ళడం కారణంగా లెక్కలు అర్థం కావడంలేదేమోనని జనం నవ్వుకుంటున్నారు. అయితే ఇదంతా జనసేన మీద జరుగుతున్న కుట్ర అని నిస్సందేహంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క సీటు గెలిచినా, ప్రజలతోనే వుంటాం.. అని జనసేన తప్ప ఏ రాజకీయ పార్టీ ధైర్యంగా చెప్పగలిగింది ఇప్పటిదాకా? గుండె మీద చెయ్యేసుకుని జనసేన అభ్యర్థులు ‘మేం ఎన్నికల్లో డబ్బు పంచలేదు’ అని చెప్పగలరు.. ఆ ధైర్యం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పగలరా? అవకాశమే లేదు.
ప్రజలు అధికారమివ్వలేదన్న అక్కసుతో అసెంబ్లీ వెళ్ళేందుకు ఇష్టపడని వైఎస్ జగన్, ఇంకోసారి అధికారమివ్వకపోతే నష్టపోతారంటూ బ్లాక్మెయిల్ చేసే చంద్రబాబు.. వీళ్ళిద్దరికీ వంత పాడే మీడియా సంస్థలు వెరసి, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు మాత్రం ఎవరికీ పట్టడంలేదు. జనసేన అధికారంలోకి వస్తుందా? రెండు మూడు సీట్లకే పరిమితమవుతుందా.? లేదంటే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందా? అనే అంశాలు జనం డిసైడ్ చేస్తారు. మార్పు కోసమంటూ ఓ ప్రయత్నం చేస్తున్న పవన్ని సమర్థించకపోయినా ఫర్వాలేదు, అలాంటి మార్పుకి మీడియా సంస్థలు అడ్డుపడకుండా వుండాలి.
జనం తిరస్కరిస్తే, జనసేనకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. అయినా, సినిమాల్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన పవన్, తిరిగి సినీ జీవితంలో రాణించడం పెద్ద కష్టం కాదు. అది అన్న చిరంజీవి చేసి చూపించారు. ఖరీదైన జీవితాన్ని వదిలేసి, జనం కోసం కష్టనష్టాల నడుమ మార్పు కోసం ప్రయత్నిస్తున్న పవన్కళ్యాణ్ని విమర్శించే నైతిక హక్కు, అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికెక్కడిది.? మార్పు మొదలైతే, ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలు తారుమారైపోతాయ్. అందుకే జనసేన జెండా చూస్తే అంత భయం. ఆ జెండా ఎగరకుండానే మట్టుబెట్టాలనే కుటిల ప్రయత్నాలు మానుకుని, ప్రజల కోసం ఆలోచిస్తే మంచిదేమో!
