ఎన్నికల పోలింగ్ ముగిశాక, ఫలితాల కోసం వేచి చూసే క్రమంలో ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో తన పని తాను చేసుకుపోతున్నారు.. కోడ్ సంగతిని సైతం పట్టించుకోవడం లేదాయన. ఆపద్ధర్మ ముఖ్యమంత్రినని తెలిసీ, చంద్రబాబు ప్రదర్శిస్తోన్న అత్యుత్సాహం అధికారుల్ని ఇరకాటంలో పడేస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం ఎన్నికల్లో తమదే గెలుపు.. అంటూ పోలింగ్ రోజునే ఓ ప్రకటన ఇచ్చి ఊరుకున్నారు. ఆ తర్వాత వ్యవహారమంతా పార్టీ నేతలు చూసుకుంటున్నారు. ఇక, జనసేన విషయానికొస్తే.. నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు జనసేనాని పవన్కళ్యాణ్.
మూడు ప్రధాన పార్టీల అధినేతల వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పోలింగ్ ముగిసింది కాబట్టి, చంద్రబాబు తిరిగి పాలనపై దృష్టి పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. జూన్ 8, 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు టర్మ్ ముగిసేది మళ్ళీ 2019 జూన్ 8నే అన్నది టీడీపీ నేతల గట్టి నమ్మకం. అయితే, ఎన్నికల కోడ్ ఇంకోలా చెబుతోంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారంలో వున్నవారికి సబబు కాదు. కానీ, ‘ఫలితాలు వచ్చేదాకా పాలనను పక్కన పడేయలేను కదా’ అని చంద్రబాబు చెబుతున్నారు.
సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు, ఎన్నికల కోడ్ని గౌరవించాలి. కానీ, ఆయన అలా చేయడంలేదు. ఈ క్రమంలో చంద్రబాబు అత్యుత్సాహంతో తీసుకుంటున్న నిర్ణయాలకు అధికారులు బలిపశువులైపోతున్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై వేటు పడింది.. దానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబే. ఇంకోపక్క, చంద్రబాబు ఏం చేసినా తప్పుపట్టడమే రాజకీయం అన్నట్లు వ్యవహరిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. చిన్న విషయానికీ ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో రాష్ట్రం పరువుని ఢిల్లీ స్థాయిలో బజారుకీడ్చేస్తోంది ప్రతిపక్షం. టీడీపీ అత్యుత్సాహానికి వైఎస్సార్సీపీ ఓవరాక్షన్ తోడై.. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతున్నాయి.
ఇదిలా వుంటే, ఓటరు ఇచ్చే తీర్పు పట్ల గట్టి నమ్మకంతో వున్న జనసేన పార్టీ, పోలింగ్ పూర్తవగానే జనంలోకి వెళ్ళడం మొదలు పెట్టింది. సమస్యలపై తమ పోరాటం కొనసాగుతూనే వుంటుందని పవన్ గతంలో చెప్పినట్లుగానే జనసేన నేతలు జనంలోనే వుంటున్నారు. పవన్కళ్యాణ్ మాత్రం, మీడియా ముందుకు రావడంలేదు. వస్తే, ఆయన జరుగుతున్న పరిణామాలపై స్పందించాలి. అలా స్పందించే క్రమంలో ఆయన్నుంచి పొరపాటు మాటలు దొర్లినా దొర్లకున్నా వివాదం చేయడానికి ఎలాగూ రాజకీయ ప్రత్యర్థులు సిద్ధంగానే వుంటారు. అందుకే, ఈ విషయంలో పవన్కళ్యాణ్ హుందాగా వ్యవహరిస్తున్నారు.
పవన్కళ్యాణ్, పార్టీ నేతలతో అంతర్గత సమీక్షల్లో మునిగి తేలుతుంటే, అభ్యర్థులు, జనసైనికులు గ్రౌండ్ లెవల్లో పరిస్థితుల్ని అధినేతకు తెలియజేస్తున్నారు, అదే సమయంలో ప్రజలకు అండదండలు అందిస్తున్నారు. ‘మేం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తాం..’ అని జనసేన నేతలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ చెబుతున్నట్లు 150 లెక్కలు జనసేన చెప్పడంలేదు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను సుతిమెత్తగా తిప్పికొడుతూనే వున్నారు జనసైనికులు.
పాతికేళ్ళ రాజకీయానికి ముందస్తుగానే సరైన వ్యూహరచన చేసుకోవడమే తమ బలమని జనసేన చెబుతోంది. గెలిచినా ఓడినా తమది ప్రజల పక్షమేనన్నది జనసేన వాదన. ఒకటి రెండు సీట్లు కూడా కష్టమేనని జనసేనను వెటకారం చేస్తూ, ఆ పార్టీ జపం చేయకుండా వుండలేకపోతున్న టీడీపీ కావొచ్చు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావొచ్చు.. మే 23న వచ్చే ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తాయి? జనసేనలా స్థిమితంగా వుండగలుగుతాయా? కష్టమే.! ఎందుకంటే, వాటికి అధికారమే పరామవధి.
