Uttarakhand: ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ఉత్తర్ కాశీ సొరంగం (Tunnel) నుంచి 41 మంది కూలీలు క్షేమంగా బయటికి వచ్చారు. సొరంగం కుప్పకూలడంతో 17 రోజులుగా చిక్కుకున్న కూలీలందరినీ అధికారులు డ్రిల్లింగ్ చేపట్టి.. గొట్టాన్ని పంపించి విజయవంతంగా రక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ కార్మికులకు పూలదండలు వేసి స్వాగతించారు. అనంతరం.. అప్పటికే సిద్ధంగా ఉంచిన ఆంబులెన్సుల్లో వారిని ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 12న జరిగిన అనూహ్య సంఘటనతో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు.
బయటకు వచ్చేందుకు 2కి.మీ దూరం ఉండటంతో వారు రాలేకపోయారు. వేగంగా స్పందించిన అధికారులు వారికి తాగునీరు, ఆహారం, మందులు పంపించే ఏర్పాట్లు చేయడంతో వారు క్షేమంగా 17రోజులు ఉండగలిగారు. అయితే.. వారిని రక్షించేందుకు ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యలు అధికారులకు సవాల్ గా మారాయి. కార్మికులను రక్షించేందుకు 57 మీటర్ల గొట్టపు మార్గాన్ని 12 మంది ‘ర్యాట్ హోల్ మైనర్ల’తో డ్రిల్లింగ్ చేసి.. కొంత మాన్యువల్ పద్ధతిలో నిర్మించి రక్షించారు.