పోటీ చేసిన రెండు చోట్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గెలవబోతున్నారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అలాగే కామారెడ్డి నుంచీ కేసీయార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీయార్ మీద గజ్వేల్లో ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున, కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
రెండు చోట్లా కేసీయార్ ఓడిపోవడం ఖాయమంటూ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చెప్పడం చూశాం. అయితే, సీన్ మారింది. ఈటెల రాజేందర్, గజ్వేల్లో ఓటమి చవిచూడక తప్పేలా లేదు. అలాగే, కామారెడ్డిలో రేవంత్ రెడ్డికీ సానుకూలత లేదు. రెండు చోట్లా కేసీయార్ గెలుపొందనున్నారట.
చిత్రమేంటంటే, హుజూరాబాద్లో మాత్రం ఈటెల రాజేందర్ గెలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కొడంగల్లో రేవంత్ రెడ్డి కూడా గెలుస్తారట. ఇవన్నీ జస్ట్ ముందస్తు అంచనాలు మాత్రమే. స్థానికంగా పరిస్థితులు పోలింగ్ సమయం నాటికి ఎలా మారతాయో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది.
ఎందుకంటే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రచారం మూగబోయాక, నోట్ల కట్టలు ఇంకాస్త జోరుగా బయటకు వస్తాయ్. అప్పుడే, వేలం ప్రక్రియ షురూ అయ్యింది. వెయ్యి రూపాయలతో మొదలైన వేలం, ఓటుకి మూడు నాలుగు వేలు దాటేసింది. రేపు సాయంత్రానికి, అది ఎక్కడిదాకా వెళుతుందో ఏమో.!
మొదటి దఫా పంపకాలు కాంగ్రెస్ పార్టీ నుంచి జోరుగా సాగుతున్నట్లు ఆయా నియోజకవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి, గజ్వేల్ ఈసారి హాట్ కేక్స్ అట.. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి. ఏం చేసినా కేసీయార్ని ఓడించలేం.. అన్న భావన బీజేపీ, కాంగ్రెస్లలో వున్నా, మెజార్టీ తగ్గించడంపై ఫోకస్ పెడుతున్నారట.
అదే సమయంలో, అదికార బీఆర్ఎస్ కూడా, అంతకు మించి ఖర్చు చేస్తోందని అంటున్నారు. ఎన్నికలంటేనే, ఓటుకు నోటు పండగ మరి.!