రాజస్థాన్ లో రాజకీయ రగడ రాజుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు తెలుస్తోంది. తనకు మద్దతిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ హస్తిన వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిది ఎమ్మెల్యేలు పైలట్ ఉన్నట్టు సమాచారం.
పార్టీలో నెలకొన్న పరిస్థితుల గురించి సోనియా, రాహుల్ గాంధీలకు వివరించడానికి పైలట్ ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తోంది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపణలు చేసిన మరుసటి రోజు పైలట్ హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కీలకమైన విషయాల్లో తనను గెహ్లాట్ పక్కనపెడుతున్నారంటూ సచిన్ పైలట్ ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి తొలి నుంచీ ఇరువురి మధ్య అంత సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ తరహాలో రాజస్థాన్ లోని గెహ్లాట్ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకు సచిన్ ను పావుగా వినియోగించుకుంటోందని గెహ్లాట్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొన్న బీజేపీ.. కమల్ నాథ్ సర్కారును కూలగొట్టి, తాను పగ్గాలు చేపట్టింది. ఇక్కడ కూడా అదే తరహా రాజకీయాలు ప్రదర్శిస్తోందని గెహ్లాట్ వర్గం వాదిస్తోంది. అయితే, అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, దానిని వారే పరిష్కరించుకోవాలని బీజేపీ స్పష్టంచేసింది. అంతకుముందు గెహ్లాట్ సర్కారును కూలదోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై రాజస్థాన్ ప్రత్యేక ఆపరేషన్ల బృందం కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను విచారించింది.
అనంతరం సీఎం గెహ్లాట్ తోపాటు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు నోటీసులు జారీచేసింది. విచారణకు తమ ముందు హాజరు కావాల్సిందిగా పైలట్ ను కోరింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు సమాచారం. ఇదంతా గెహ్లాట్ కుట్రేనని భావించిన ఆయన.. వెంటనే పార్టలోని పరిస్థితులను అధిష్టానానికి నివేదించేందుకు ఆదివారం ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ ను మరో మధ్యప్రదేశ్ కానీయబోమని.. ఈ అంశాన్ని పరిష్కరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
807156 103616Spot on with this write-up, I truly assume this internet site wants a lot a lot more consideration. probably be once again to read much a lot more, thanks for that info. 606711