అధికారం శాశ్వతం అని ప్రజాస్వామ్యంలో ఎవరూ విర్రవీగడానికి లేదు. ఇంకో పాతికేళ్ళు అధికారంలో వుండేది తామేనంటూ, వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.! ఏమయ్యిందిప్పుడు.? వైసీపీ హయాంలో వైసీపీ రంగులతో నడిచిన ప్రచార పిచ్చి అంతా కాలగర్బంలో కలిసిపోతోంది.
ఎక్కడికక్కడ సిద్ధం బ్యానర్లను నిర్దాక్షిణ్యంగా పీకి పారేస్తున్నారు. వందల కోట్లు ఖర్చు చేసింది వైసీపీ, ‘సిద్ధం’ ప్రచారం కోసం. కానీ, అవన్నీ చాలా తేలిగ్గా ఇప్పుడు చించి పోగులు పెట్టేస్తుండడం గమనార్హం. వీటన్నిటినీ చూసి వైసీపీ శ్రేణులు అస్సలు తట్టుకోలేకపోతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకీ ముసుగులు తొడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఆయా విగ్రహాలు కనపడనీయకుండా చీరలు చుట్టేస్తున్న వైసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతా బాగానే వుందిగానీ, ప్రభుత్వ కార్యాలయాలకి వేసిన రంగుల సంగతేంటి.? న్యాయస్థానాలు చీకొట్టినా కొన్ని చోట్ల ఆ రంగులు అలాగే వుండిపోయాయ్. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ రంగుల్ని వున్నపళంగా తొలగించాల్సిన అవసరం వుంది.
వీటితోపాటుగా, సంక్షేమ పథకాల పేరుతో వైఎస్ జగన్ ఫొటోలతో కూడిన బుక్ లెట్లు వంటివి జనంలోకి తీసుకెళ్ళి, నెల నెలా వాటితోనే లబ్దిదారులకు చెల్లింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటినిప్పుడు ఏం చేస్తారు.?
జగన్ ఫొటోలతో పాతిన హద్దు రాళ్ళ సంగతేంటి.? వాటినీ పీకి పారేస్తారా.? పీకి పారేస్తే మాత్రం.. అదో సంచలనమే అవుతుంది. ముందు ముందు ఏ ప్రభుత్వం ఇలాంటి విపరీత పోకడలకు పోకుండా తగిన చట్టాల్ని కేంద్రమే రూపొందించాల్సి వుంటుంది.
ప్రచార పిచ్చి.. అన్న మాటకి పీక్స్.. చూపించేసింది వైసీపీ ప్రభుత్వం. అంతలా విర్ర వీగితే, ఎన్నికల కోడ్ వచ్చి, ఆ పిచ్చి కుదిర్చేసిందన్నమాట.