Tirupathi: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. వందల ఏళ్ల నాటి రావిచెట్టు గురువారం సాయంత్రం ఒకసారిగా కుప్పకూలింది. ఆలయ మహా ద్వారానికి ఎదురుగా ఉన్న ఈ వృక్షం.. నిన్న కురిసిన గాలివానకి చెట్టు మొదలు రెండుగా చీలిపోయి అక్కడే ఉన్న భక్తులపై పడింది. ఈ ఘటన లో ఓ భక్తుడు మృతి చెందాడు. మరికొంతమందికి గాయాలయ్యాయి.
మృతి చెందిన వ్యక్తి కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప గా గుర్తించారు. ఆయన కుమార్తె రవళి నగరంలోని ఓ కళాశాలలో వైద్య విద్య చదువుతోంది. ఆమెను చూడటానికి గుర్రప్ప తిరుపతి వచ్చారు. అనంతరం తండ్రి, కుమార్తె ఇద్దరు కలిసి గోవిందరాజస్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా. ఒక్కసారిగా చెట్టు విరిగి గుర్రప్పపై పడింది. ఈ ఘటనలో ఆయన తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ళముందే తండ్రి ప్రాణాలు వదలడం చూసిన రవళి రోదించిన తీరు అక్కడున్న భక్తులందరినీ కలచివేసింది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక రుయా ఆసుపత్రిలో చేర్చారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మృతునికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు చెప్పారు.
గజరాజులు ప్రమాదాన్ని ముందే పసిగట్టాయా?
ఈ ఘటనకు కొద్దిసేపటికి ముందే వాహన సేవకు ఆలయానికి గజరాజులు వచ్చాయి. ఆలయ ఆవరణలో ఏనుగులు పెద్దగా ఘీంకారం చేస్తుండటంతో సిబ్బంది వాటిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ప్రమాదం జరిగే వరకు అవి అలాగే అరుస్తూనే ఉన్నాయి. ప్రమాదాన్ని గజరాజులు ముందే పసిగట్టి ఉంటాయని భక్తులు అంచనా వేస్తున్నారు.