తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా, వాలంటీర్లకు నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామనీ ఆయన ప్రకటించేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. అప్పుల కుప్ప ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అన్నదే లేకుండా పోయింది గత ఐదేళ్ళుగా.! కేవలం సంక్షేమం మీదనే బండి నడిపేసింది వైసీపీ సర్కారు.!
ఈ ఎన్నికల్లో ఎవరు అధికార పీఠమెక్కినా, వారి ముందు బోల్డంత అప్పుల కుప్ప కనిపిస్తుంది. ఖజానా ఖాళీ అయిపోయి వుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తే, అంతా ప్రజల నుంచే పన్నుల రూపంలో రాబట్టాలి. అలా రాబట్టిన సొమ్మునే, సంక్షేమం కోసం ఖర్చు చేయాలి.. అప్పులు చెల్లించడానికీ చేయాలి.. రాష్ట్రం గడవాలి.
ఫస్ట్ టైమ్ సీఎం అయిన వైఎస్ జగన్, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది చంద్రబాబు అండ్ టీమ్ ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు కూడా. రాజకీయ విమర్శకీ, బాధ్యతాయుతమైన విమర్శకీ చాలా తేడా వుంది. జనసేన పార్టీ, బాధ్యతాయుతమైన విమర్శలు చేస్తూ వస్తోంది.
టీడీపీ – జనసేన – బీజేపీ జతకట్టి, వైసీపీని ఓడించాలనుకుంటున్నాయి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో, సంక్షేమమే తమను గెలిపిస్తుందని నమ్ముతోన్న వైసీపీకి, అదే బాటలో దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబు వ్యూహం అయితే అయి వుండొచ్చు. కానీ, ఇదా పద్ధతి.?
వాలంటీర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులేమీ కారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం. వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించారు. ఆ వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ ప్రభుత్వం వస్తే నెలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారా.?
వందల కోట్లు కాదు, వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇకపై వాలంటీర్లకి. ఇదంతా ప్రజాధనమే.! ఎన్నికల హామీ ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే.! సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు, అనాలోచిత ప్రకటనలు చేస్తే ఎలా.?