విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి సుజనా చౌదరి ఒకప్పుడు ఆర్థికంగా వెన్ను దన్నుగా వుండేవారు.
టీడీపీకి షాకిచ్చి బీజేపీలో చేరారన్నమాటేగానీ, బీజేపీలో వుంటూ, చంద్రబాబు కోసం సుజనా చౌదరి పని చేశారన్నది బహిరంగ రహస్యం. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ బీజేపీ నుంచి దక్కడానికి చంద్రబాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు.
ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున టిక్కెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్, తాజాగా నేడు వైసీపీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు పోతిన మహేష్.
జనసేన పార్టీకి సంబంధించి పంచకర్ల సందీప్, పోతిన మహేష్ లాంటి నాయకులకి జనసేన కార్యకర్తల్లో స్పెషల్ అభిమానం వున్నమాట వాస్తవం. పోతిన మహేష్ టిక్కెట్ దక్కించుకోలేకపోవడాన్ని చాలామంది జనసైనికులు తొలుత జీర్ణించుకోలేకపోయారు.
‘వైసీపీతో టచ్లో వున్నాడాయన..’ అన్న టాక్ మొదటి నుంచీ మహేష్ మీద వుందిగానీ, ఆయన జనసేనకు వెన్నుపోటు పొడుస్తారంటే ఎవరూ నమ్మలేదు. టైమ్ చూసి వెన్నుపోటు పొడిచాడు పోతిన మహేష్. నిజానికి, తొందరపాటు నిర్ణయమే తీసుకున్నాడాయన.
కాస్త ఓపిక పట్టి వుంటే, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుడిగా ఆయన బలం మరింత పెరిగి వుండేది. సుజనా చౌదరికి ఢిల్లీ రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ. విజయవాడ వెస్ట్లో ఓడితే, ఆయన మళ్ళీ ఢిల్లీ రాజకీయాలకే పరిమితమవుతారు. అప్పుడు పోతిన మహేష్, చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం వుండేది.
ఇక్కడ జనసేనకీ ఓ మంచి జరిగింది. పోతిన మహేష్ అసలు రంగు ఏంటన్నది బయటపడిపోయింది. ‘పవన్ కళ్యాణ్ ఏం చేసినా, అన్నీ ఆలోచించే చేస్తారు. పోతిన మహేష్కి టిక్కెట్ ఇవ్వకపోవడంలోనూ ఆయన నిర్ణయం సరైనదే’ అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
అన్నట్టు, ఈ మొత్తం వ్యవహారంలో సుజనా చౌదరికి కాలం కలిసొచ్చినట్లయ్యింది. ఇప్పటిదాకా సుజనా చౌదరి మీద వున్నచీదరింపు జనసైనికుల్లో కాస్త తగ్గింది. చిన్న గీత.. పెద్ద గీత లెక్క తెలుసు కదా.! చీదరింపు విషయంలో మహేష్ పెద్ద గీత అయి కూర్చున్నారిప్పుడు. పోతిన మహేష్ కంటే, సుజనా చౌదరి బెటర్.. పైగా పొత్తు ధర్మం.. అని విజయవాడ వెస్ట్లో జనసైనికులు సర్దుకుపోతున్నారు.
ఈ అనూహ్యమైన రాజకీయ పరిణామం నేపథ్యంలో సుజనా చౌదరి విజయావకాశాలు కాస్త మెరుగుపడినట్లే కనిపిస్తోంది.!