హైదరాబాద్ కాచిగూడలో దారుణం జరిగింది. స్థానిక కమలమ్మ అనే 85 ఏళ్ల వృద్దురాలును పనిమనిషి లక్ష్మి దారుణంగా చంపి పరారైంది. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం… కమలమ్మ పిల్లలు ఉద్యోగాల రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కమలమ్మకు పనిమనిషి అవసరం ఉండటంతో కొన్ని రోజుల క్రితం లక్ష్మిని కొత్తగా ఒక ఏజెన్సీ వారు పనిమనిషిగా కుదర్చడం జరిగింది. కొన్నాళ్ల పాటు బాగానే పని చేసిన లక్ష్మికి కమలమ్మ ఒంటి మీద ఉన్న బంగారం మరియు డబ్బుపై మోజు పుట్టింది.
తాజాగా కమలమ్మను దిండుతో నొక్కి చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న పది తులాల బంగారం మరియు ఇంట్లో ఉన్న పది వేల రూపాయలు మరియు ఖరీదైన వస్తువులను తీసుకుని పారిపోయింది. ఆ క్రమంలో ఆమె ఒక ఆటోలో ప్రయాణించడంతో ఆమె బ్యాంకు పాస్ బుక్ ఆటోలో పడిపోయింది. ఆ ఆటోలో దొరికిన బ్యాంక్ పాస్బుక్ ఆధారంగా పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమెను పనికి కుదిర్చిన ఎజెన్సీ నిర్వాహకులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.